
India vs Sri Lanka Test series 2026: శ్రీలంకతో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్కు దిగేందుకు టీమిండియా సమాయత్తమవుతోంది. ఆగస్టు 4న కొలంబో విమానం ఎక్కేందుకు శుభ్మన్ గిల్ సేన సిద్ధమైంది. అయితే పర్యటనకు ముందే బీసీసీఐ షెడ్యూల్లో ఊహించని మార్పులు చేయడంతో క్రికెట్ వర్గాల్లో ఈ పర్యటన హాట్ టాపిక్గా మారింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో కీలకంగా మారిన ఈ సిరీస్ కోసం భారత జట్టు సన్నాహాలు ముమ్మరం చేసింది. పర్యటనలో భాగంగా తొలుత నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా, దాని వ్యవధిని ముచ్చటగా మూడు రోజులకు కుదించారు. ఆగస్టు 7 నుంచి 9 వరకు కొలంబోలోని ఎన్సిసి మైదానంలో ఈ ప్రాక్టీస్ పోరు జరగనుంది. చివరి నిమిషంలో ఈ మ్యాచ్ నిడివి తగ్గించడానికి గల అసలు కారణాలు బిసిసిఐ వెల్లడించలేదు.
సాధారణంగా ప్రాక్టీస్ మ్యాచ్లకు ప్రత్యక్ష ప్రసారం ఉండదు. అయితే ఈసారి శ్రీలంక బోర్డు అభిమానులకు తీపి కబురు అందించేలా సన్నాహాలు చేస్తోంది. ఇండియా, శ్రీలంక ప్రాక్టీస్ మ్యాచ్ను టీవీ, డిజిటల్ ప్లాట్ఫామ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. భారత యంగ్స్టర్స్ తుది జట్టులో స్థానం కోసం ప్రాక్టీస్ మ్యాచ్లోనే పోటీపడనుండటంతో ఈ మ్యాచ్పై విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ఆగస్టు 4న కొలంబో చేరుకోనున్న భారత జట్టు, 7వ తేదీ నుంచి మూడు రోజుల పాటు వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. అనంతరం తొలి టెస్టు కోసం గాలే నగరానికి పయనమవుతుంది. ఆగస్టు 15న గాలే వేదికగా మొదటి టెస్టు ప్రారంభం కానుండగా, ఆగస్టు 23 నుంచి కొలంబోలోని ప్రసిద్ధ ఎస్ఎస్సి గ్రౌండ్లో రెండో టెస్టు జరగనుంది. రెండవ టెస్టులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని గిల్ సేన పట్టుదలతో ఉంది.
గాయాల కారణంగా సందిగ్ధంలో పడిన కొందరు ఆటగాళ్ల ఫిట్నెస్పై సానుకూల వార్తలు వచ్చాయి. మోకాలి గాయం నుండి పూర్తిగా కోలుకున్న జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సాధించినట్లు బిసిసిఐ స్పష్టం చేసింది. దాంతో తొలి టెస్టు ఆడే తుది జట్టులో అతడి స్థానం ఖాయమైంది. బొటనవేలి గాయం వల్ల బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోలుకుంటున్న సాయి సుదర్శన్ కూడా ఇప్పటికే బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. అతడు పూర్తిగా కోలుకుంటే ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కడం ఖాయం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..