IND vs ENG: రెండో టీ20కి ముందు షాకింగ్ న్యూస్.. మరోసారి మహ్మద్ షమీ బెంచ్‌కే..?

IND vs ENG: మడమ గాయం, మోకాలి వాపు కారణంగా, స్టార్ పేసర్ మహ్మద్ షమీ 14 నెలలకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. టీ20 సిరీస్‌కు అతనికి జట్టులో స్థానం లభించింది. ఇందులో బౌలింగ్ ద్వారా అతను ఛాంపియన్స్ ట్రోఫీకి పూర్తిగా సిద్ధమవుతాడని భావిస్తున్నారు.

IND vs ENG: రెండో టీ20కి ముందు షాకింగ్ న్యూస్.. మరోసారి మహ్మద్ షమీ బెంచ్‌కే..?
India Vs Malaysia Vaishnavi

Updated on: Jan 24, 2025 | 7:20 AM

Mohammed Shami: టీమిండియా బ్లూ జెర్సీలో వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మరోసారి అద్భుతాలు చేస్తాడని ఎదురుచూపులు పెరుగుతున్నాయి. మడమ గాయం, ఆపై మోకాలి వాపు కారణంగా సుమారు 14 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న షమీ.. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. కానీ, తొలి మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. ఇప్పుడు అతని పునరాగమనానికి మరికొంత సమయం పట్టవచ్చని, రెండో టీ20 మ్యాచ్‌లో కూడా ఆడలేడని భావిస్తున్నారు.

రెండో టీ20లో కూడా ఆడడం కష్టం..

స్టార్ పేసర్ షమీ రెండో టీ20 మ్యాచ్‌కు కూడా దూరంగా ఉండొచ్చని ఓ నివేదిక పేర్కొంది. ఈ మ్యాచ్ జనవరి 25వ తేదీ శనివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. షమీ ఇప్పటికీ పూర్తిగా ఫిట్‌గా లేడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదటి టీ20 మ్యాచ్‌లో అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడంతో, అతని ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ వాదనలు ఈ నివేదిక ద్వారా బలపడుతున్నాయి.

కోల్‌కతాలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ తర్వాత, యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ మాట్లాడుతూ, షమీ ఖచ్చితంగా ఫిట్‌గా ఉన్నాడని, అయితే అతన్ని ఎందుకు జట్టులోకి తీసుకోలేదో జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయమంటూ చెప్పుకొచ్చాడు. ఈ టీ20 మ్యాచ్‌కు ముందు వార్మప్ సమయంలో, షమీ తన రన్-అప్ సమయంలో ఇబ్బందుల్లో పడ్డాడు. మ్యాచ్‌లో బ్రాడ్‌కాస్టర్ కోసం వ్యాఖ్యానించిన మాజీ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా కూడా షమీ కొంచెం కుంటుపడుతున్నాడని ఎత్తి చూపాడు. షమీ పూర్తి ఫిట్‌గా లేకుంటే ఈ సిరీస్ కంటే ఛాంపియన్స్ ట్రోఫీలోనే టీమ్ ఇండియాకు ఇబ్బందిగా మారవచ్చు.

కారణం ఇదేనా?

అసలు నిజం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. షమీ, భారత జట్టు మేనేజ్‌మెంట్ మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. అయితే, ఇది 5 మ్యాచ్‌ల సిరీస్ కాబట్టి వెంటనే షమీపై బౌలింగ్ భారం వేయకూడదని మేనేజ్‌మెంట్ భావించే అవకాశం ఉంది. కోల్‌కతా టీ20లో చూస్తే, ఇక్కడ భారత జట్టుకు అదనపు పేసర్ అవసరం లేదు. ఎందుకంటే, ముగ్గురు స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. చెన్నై స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌పై కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో షమీకి ఇక్కడ ఎలాగైనా ఆడడం కష్టంగా కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని అతనికి మరికొంత విశ్రాంతి ఇచ్చే అవకాశం కూడా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us