
Super 8 Rain Washout What Happens: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశ ప్రారంభానికి ముందే వర్షం భయం వెంటాడుతోంది. ముఖ్యంగా కొలంబోలో వాతావరణం అనిశ్చితంగా ఉండటంతో కీలక మ్యాచ్లు వర్షంలో కొట్టుకుపోతే ఏమవుతుందనే సందేహం అభిమానుల్లో నెలకొంది. ఇలాంటి పెద్ద మ్యాచ్లకు ఐసీసీ ఎలాంటి నిబంధనలు పెట్టింది? ఇప్పుడు తెలుసుకుందాం.
టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్ 8 రౌండ్కు భారత్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్లోని జట్లు పరస్పరం ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ప్రతి గ్రూప్లో టాప్ 2 జట్లు సెమీఫైనల్కు చేరతాయి. అందువల్ల ప్రతి మ్యాచ్ ఎంతో కీలకం.
గ్రూప్ దశలాగే సూపర్ 8 మ్యాచ్లు కూడా భారత్, శ్రీలంకలో నిర్వహించబడుతున్నాయి. కొలంబోలో వరుసగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో మ్యాచ్ రద్దైతే ఏం జరుగుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. సూపర్ 8 మ్యాచ్లకు గ్రూప్ స్టేజ్లాగే రిజర్వ్ డే ఏర్పాటు లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం టీ20 మ్యాచ్లో ఫలితం రావాలంటే రెండు జట్లు కనీసం 5–5 ఓవర్లు ఆడాల్సిందే. అందువల్ల అంపైర్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ పూర్తి చేయించేందుకు ప్రయత్నిస్తారు.
వర్షం కారణంగా కనీసం 5 ఓవర్లు కూడా ఆడలేని పరిస్థితి వస్తే మ్యాచ్ను రద్దు చేసినట్లుగా పరిగణిస్తారు. అప్పుడు ఇరు జట్లకు చెరో ఒక్క పాయింట్ ఇవ్వబడుతుంది. నెట్ రన్ రేట్పై ఎలాంటి ప్రభావం ఉండదు. పాయింట్ల పట్టికలో ఇరు జట్లకు సమానంగా పాయింట్లు చేరతాయి. కానీ, గెలుపు లాభం ఎవరికీ దక్కదు.
సూపర్ 8 దశలో ప్రతి జట్టు మూడు మ్యాచ్లు ఆడాలి. ప్రతి మ్యాచ్కు రెండు పాయింట్లు ఉంటాయి. వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే ఆ రెండు పాయింట్లను సాధించే అవకాశం కోల్పోయినట్లే. ఇది సెమీఫైనల్ రేసులో పెద్ద దెబ్బగా మారవచ్చు. ముఖ్యంగా నెట్ రన్ రేట్ పరంగా ముందున్న లేదా వెనుకబడిన జట్లకు ఇది నష్టం కలిగించే అవకాశం ఉంది.
టోర్నమెంట్లో ఇప్పటికే జింబాబ్వే vs ఐర్లాండ్ మ్యాచ్ పూర్తిగా వర్షం కారణంగా రద్దయ్యింది. ఆ మ్యాచ్లో ఇరు జట్లకు చెరో ఒక్క పాయింట్ ఇవ్వడంతో సూపర్ 8 అర్హతపై కూడా ప్రభావం పడింది. ఇదే తరహా పరిస్థితి సూపర్ 8లోనూ తలెత్తితే సమీకరణాలు పూర్తిగా మారే అవకాశముంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..