
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు ఒక క్లైమాక్స్ సినిమాను తలపిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా ప్రతి మ్యాచ్ చావో రేవో అన్నట్లుగా మారింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్ చేరాలంటే కేవలం గెలిస్తే సరిపోదు.. అదృష్టం కూడా తోడవ్వాలి. ముఖ్యంగా సౌతాఫ్రికా చేతిలో ఎదురైన 76 పరుగుల ఘోర పరాజయం భారత్ నెట్ రన్ రేట్ను మైనస్ (-3.800)కి పడదోసింది. ఇప్పుడు మన జట్టు గండం గట్టెక్కాలంటే జింబాబ్వేపై జరగబోయే మ్యాచ్లో మామూలు విజయం సరిపోదు, ఒక భారీ విధ్వంసం సృష్టించాల్సిందే. జింబాబ్వేను చిత్తుగా ఓడించి రన్ రేట్ను పెంచుకుంటేనే, ఆ తర్వాత వెస్టిండీస్తో జరిగే పోరులో మనకు అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వెస్టిండీస్ +5.350 రన్ రేట్తో అగ్రస్థానంలో ఉంటే, సౌతాఫ్రికా +3.800 తో రెండో స్థానంలో ఉంది. భారత్ మూడో స్థానంలో పడిపోయింది. ఫిబ్రవరి 26న జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్లో భారత్ ఎంత భారీగా గెలవాలో ఒకసారి లెక్కలు వేసి చూద్దాం. ఒకవేళ భారత్ మొదట బ్యాటింగ్ చేసి 220 పరుగులు చేస్తే.. జింబాబ్వేను కనీసం 120 పరుగుల లోపే కట్టడి చేయాలి. అంటే 100 పరుగుల కంటే ఎక్కువ తేడాతో గెలిస్తేనే రన్ రేట్ గణనీయంగా మెరుగుపడుతుంది. అలా కాకుండా జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసి 150-160 పరుగులు చేస్తే, భారత్ ఆ లక్ష్యాన్ని కేవలం 11 లేదా 12 ఓవర్లలోనే ఫినిష్ చేయాలి. అప్పుడే మన రన్ రేట్ పాజిటివ్లోకి వచ్చి పటిష్టంగా మారుతుంది.
అయితే ఈ లెక్కలు వేయడం సులభమే కానీ, మైదానంలో అమలు చేయడం కష్టం. ఎందుకంటే ఈ వరల్డ్ కప్లో జింబాబ్వే మామూలు ఫామ్లో లేదు. లీగ్ స్టేజ్లోనే ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి దిగ్గజ జట్లనే ఓడించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాబట్టి వాళ్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. భారత్ సెమీస్ చేరడానికి ఉన్న మెయిన్ ఈక్వెషన్స్ ఒకసారి పరిశీలిస్తే పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉందో అర్థమవుతుంది.
సెమీఫైనల్ ఈక్వేషన్ – 1 (సౌతాఫ్రికా సాయం చేస్తే)
ఒకవేళ టీమిండియా తన మిగిలిన రెండు మ్యాచుల్లో (జింబాబ్వే, వెస్టిండీస్) గెలిస్తే భారత్ ఖాతాలో 4 పాయింట్లు చేరుతాయి. అదే సమయంలో సౌతాఫ్రికా జట్టు వెస్టిండీస్ను ఓడించాలి. అప్పుడు వెస్టిండీస్ 2 పాయింట్లతోనే ఆగిపోతుంది. ఫలితంగా భారత్, సౌతాఫ్రికా నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఇక్కడ నెట్ రన్ రేట్తో పెద్దగా ఇబ్బంది ఉండదు.
సెమీఫైనల్ ఈక్వేషన్ – 2 (వెస్టిండీస్ గెలిస్తే)
ఒకవేళ వెస్టిండీస్ జట్టు సౌతాఫ్రికాను ఓడించిందనుకోండి.. అప్పుడు పరిస్థితి మరింత జటిలం అవుతుంది. అప్పుడు భారత్ తన రెండు మ్యాచులను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో గెలిచి, వెస్టిండీస్ను కూడా ఓడిస్తే.. అప్పుడు భారత్, వెస్టిండీస్ చెరో 4 పాయింట్లతో నిలుస్తాయి. అప్పుడు ఎవరి రన్ రేట్ ఎక్కువగా ఉంటే వాళ్లే సెమీస్ వెళ్తారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..