
లభారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం (మార్చి 8) సాయంత్రం 7:00 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా విజయం సాధిస్తే, మూడోసారి వరల్డ్ కప్ ట్రోఫీని గెలవడమే కాకుండా క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని మూడు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంటుంది.
గతంలో 2007లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో పాకిస్థాన్ను ఓడించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన భారత్, 2024లో సౌతాఫ్రికాను చిత్తు చేసి రెండోసారి కప్ను ముద్దాడింది. ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా కివీస్ను ఓడిస్తే భారత్ సృష్టించబోయే ఆ 3 రికార్డులు ఏంటో ఓసారి చూద్దాం..
ఒకవేళ భారత్ 2026 ఫైనల్ గెలిస్తే, మూడుసార్లు టీ20 వరల్డ్ కప్ టైటిల్ సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఏ దేశం కూడా మూడుసార్లు ఈ ఫార్మాట్లో ఛాంపియన్గా నిలవలేదు. ప్రస్తుతం భారత్ (2), వెస్టిండీస్ (2), ఇంగ్లాండ్ (2) సమానంగా ఉండగా.. టీమ్ ఇండియా ఈ విజయంతో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ దేశం కూడా తమ సొంత గడ్డపై (Host Country) ఆడుతూ ట్రోఫీని గెలవలేదు. శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి జట్లు ప్రయత్నించినప్పటికీ ఈ ఫీట్ సాధించలేకపోయాయి. ఇప్పుడు భారత్ కనుక అహ్మదాబాద్లో కప్పు కొడితే, సొంత వేదికపై టీ20 వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన తొలి దేశంగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది.
భారత్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్గా నిలిచింది. ఇప్పుడు 2026లో కూడా టైటిల్ గెలిస్తే, వరుసగా రెండు టీ20 ప్రపంచకప్లు గెలిచిన తొలి జట్టుగా టీమ్ ఇండియా అవతరిస్తుంది. అలాగే, తమ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న (Title Defence) మొదటి దేశంగా కూడా భారత్ రికార్డు నెలకొల్పుతుంది. ఇప్పటివరకు ఏ జట్టుకూ ఈ ‘బ్యాక్-టు-బ్యాక్’ విజయం సాధ్యపడలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..