
T20 World Cup 2026: న్యూజిలాండ్తో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? కీలకమైన ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్లో ఒక విధ్వంసకర బ్యాటర్కు అనూహ్యంగా అవకాశం దక్కనుందా? భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఈ టైటిల్ సమరం ఆదివారం (మార్చి 8) సాయంత్రం 7:00 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభం కానుంది.
భారత జట్టు మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇంతకుముందు 2007, 2024లో టీమ్ ఇండియా ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2026లో మరోసారి చరిత్ర సృష్టించేందుకు సూర్య సేన సిద్ధమైంది.
న్యూజిలాండ్తో జరిగే ఫైనల్ మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్లో భారీ మార్పు చేసే అవకాశం ఉంది. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మను పక్కన పెట్టి, అతని స్థానంలో మెరుపు బ్యాటర్ రింకూ సింగ్ ను జట్టులోకి తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. రింకూ సింగ్ మిడిల్ ఆర్డర్లో టీమ్ ఇండియాకు అదనపు బలాన్ని ఇవ్వగలడు. ఒకవేళ ఇదే జరిగితే, ఓపెనింగ్లో సంజూ శాంసన్తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు.
ఈ టీ20 ప్రపంచకప్లో అభిషేక్ శర్మ ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 7 ఇన్నింగ్స్ల్లో అతను కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. అతని స్కోర్లు పరిశీలిస్తే: 0, 0, 0, 15, 55, 10, 9 పరుగులు. గురువారం ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో కూడా అభిషేక్ కేవలం 9 పరుగులకే అవుట్ అయ్యాడు. టోర్నీ ప్రారంభంలో అతనిపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, కీలక సమయాల్లో కెప్టెన్, కోచ్ నమ్మకాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు.
న్యూజిలాండ్పై ఫినిషర్ పాత్ర పోషించడానికి రింకూ సింగ్ సరైన ఎంపిక అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడో నంబర్ స్థానంలో రింకూ బ్యాటింగ్ చేయడం జట్టుకు ఎంతో ప్రయోజనకరం. ఇప్పటివరకు భారత్ తరపున 45 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన రింకూ, 155.74 స్ట్రైక్ రేట్తో 665 పరుగులు చేశాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలోనూ, భారీ సిక్సర్లు బాదడంలోనూ రింకూ సింగ్ దిట్ట. కివీస్ స్పిన్ అటాక్ను ఎదుర్కోవడానికి రింకూ వంటి పవర్ హిట్టర్ జట్టులో ఉండటం అవసరమని సూర్య భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..