
IND vs PAK, Handshake Controversy: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్ దశలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య గ్రాండ్ ఫినాలే ఈరోజు జరగనుంది. ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కు ముందు, కెప్టెన్ల హ్యాండ్ షేక్ అంశం మరోసారి చర్చకు దారితీసింది. కొంతకాలంగా, భారత కెప్టెన్ టాస్ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ తో కరచాలనం చేయడం లేదనే సంగతి తెలిసిందే. ఇది క్రికెట్ లో సాధారణంగా కనిపించే ఒక ఆచారం. ఈసారి టీం ఇండియా తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా లేదా అనే దానిపై ఒక కీలక అప్డేట్ వచ్చింది.
మీడియా నివేదికల ప్రకారం, టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాతో కరచాలనం చేయకుండా ఉంటాడు. భారత జట్టు తన నిర్ణయాన్ని మార్చుకోదు. గత సంవత్సరం, ఆసియా కప్ సమయంలో, పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్లలో కూడా భారత జట్టు కరచాలనం చేయకుండా ఉంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి, గత సంవత్సరం మేలో జరిగిన సంఘటనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాద దాడి 26 మంది మృతి చెందిన తర్వాత భారతదేశం – పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణ చోటు చేసుకుంది. అప్పటి నుంచి పరిస్థితి మెరుగుపడలేదు. అందుకే భారత జట్టు తన నిర్ణయాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది.
మ్యాచ్ కు ముందు రోజు జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యకుమార్ ను దీని గురించి ప్రశ్నించగా, అతను సరదాగా ఇలా సమాధానమిచ్చాడు, “24 గంటలు వేచి ఉండండి, మీకు తెలుస్తుంది. మ్యాచ్ ముఖ్యమా, లేదా ఇదంతా ముఖ్యమా? ఈ ఉత్కంఠను రేపు ముగించేస్తాం” అని చెప్పుకొచ్చాడు. తన దృష్టి మ్యాచ్ పైనే ఉందని, తాను మంచి క్రికెట్ ఆడటానికి వచ్చానని అతను నొక్కి చెప్పాడు. హ్యాండ్ షేక్ పైనే కాకుండా ఆటపై దృష్టి పెట్టాలని అందరికీ సలహా ఇచ్చాడు.
అయితే, భారత మాజీ బ్యాట్స్మన్ సంజయ్ మంజ్రేకర్ దీనిని సోషల్ మీడియాలో “వింత చర్య”గా అభివర్ణించారు. భారత్ వంటి జట్టు ఇలాంటి వాటికి దూరంగా ఉండి క్రికెట్ స్ఫూర్తితో ఆడాలని అన్నారు. సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ “భారత జట్టు ప్రవేశపెట్టిన ‘ నో హ్యాండ్షేక్’ అనే నియమం చాలా విచిత్రమైన చర్య. ఇది భారతదేశం వంటి దేశానికి తగనిది. సరిగ్గా ఆడండి, ఆట స్ఫూర్తితో ఆడండి లేదా అస్సలు ఆడకండి” అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..