ICC vs PCB : ఐసీసీ వర్సెస్ పాక్ వివాదంలోకి బంగ్లాదేశ్ ఎంట్రీ..ఇండో-పాక్ మ్యాచ్పై కొత్త ట్విస్ట్
ICC vs PCB : టీ20 ప్రపంచకప్ 2026 వేదికగా సాగుతున్న హైడ్రామాలో ఇప్పుడు ఊహించని మలుపు చోటుచేసుకుంది. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ వివాదం ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్యే కాకుండా, బంగ్లాదేశ్ ప్రమేయంతో సరికొత్త మలుపు తిరిగింది.

ICC vs PCB : టీ20 ప్రపంచకప్ 2026 వేదికగా సాగుతున్న హైడ్రామాలో ఇప్పుడు ఊహించని మలుపు చోటుచేసుకుంది. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ వివాదం ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్యే కాకుండా, బంగ్లాదేశ్ ప్రమేయంతో సరికొత్త మలుపు తిరిగింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన దాయాదుల పోరుపై సందిగ్ధత కొనసాగుతున్న తరుణంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ వివాదంలో తలదూర్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి బీజం బంగ్లాదేశ్ వేసింది. భారత్లో భద్రతా కారణాల దృష్ట్యా తమ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లను ఇండియాలో ఆడబోమని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం తేల్చిచెప్పింది. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అయితే భద్రతాపరమైన ముప్పు ఏమీ లేదని స్వతంత్ర సంస్థల రిపోర్టులు రావడంతో ఐసీసీ ఈ అభ్యర్థనను తిరస్కరించింది. నిర్ణీత గడువులోగా బంగ్లాదేశ్ జట్టు రాకపోవడంతో, ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తప్పించి, వారి స్థానంలో స్కాట్లాండ్ను గ్రూప్-సి లోకి చేర్చింది.
బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తొలగించడం అన్యాయం అని, రాజకీయ ప్రేరేపితం అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆరోపించింది. బంగ్లాదేశ్కు మద్దతుగా ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన హై-ప్రొఫైల్ మ్యాచ్ను బహిష్కరిస్తామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. భద్రత లేదని భావించే చోట ఆడేలా ఏ బోర్డును ఒత్తిడి చేయకూడదని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వాదిస్తున్నారు. ఈ డెడ్లాక్ను తొలగించడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ ఇప్పుడు లాహోర్ చేరుకున్నారు. ఆయన పీసీబీ అధికారులతో భేటీ అయ్యి, ఐసీసీ ముందు ఉమ్మడి గళాన్ని వినిపించాలని భావిస్తున్నారు.
మరోవైపు భారత్తో మ్యాచ్ ఆడాలంటే తాము కొన్ని కండిషన్లు పెడుతున్నామని పాక్ అధికారులు చెబుతున్నారు. ఐసీసీ తన రెవెన్యూ వాటాను పెంచాలని, భారత్తో మళ్ళీ ద్వైపాక్షిక సిరీస్లు ఆడేలా హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఒక మ్యాచ్ కోసం ఇలా ఫోర్స్ మెజ్యూర్ క్లాజ్ (నియంత్రించలేని పరిస్థితులు) వాడటం సాధ్యం కాదని ఐసీసీ ఇప్పటికే పాక్ను హెచ్చరించింది. ఒకవేళ మ్యాచ్ ఆడకపోతే పాయింట్లు కోల్పోవడమే కాకుండా, భారీ జరిమానాలు, హోస్టింగ్ హక్కుల రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.
ప్రస్తుతం లాహోర్లో ఐసీసీ ప్రతినిధులు, పీసీబీ, బీసీబీ అధికారుల మధ్య త్రైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా కూడా రంగంలోకి దిగారు. మ్యాచ్ జరగకపోతే ఐసీసీకి సుమారు రూ.300 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుంది. అయితే లోపాయికారీ చర్చలు సత్ఫలితాలను ఇస్తాయని, భారత్-పాక్ మధ్య మెగా పోరు కచ్చితంగా జరుగుతుందని ఐసీసీ డైరెక్టర్ ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
