
IND vs PAK : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలైన సమరం వచ్చేసింది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించాలంటే అందరి కళ్లు ఇప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పైనే ఉన్నాయి. ఫామ్లోకి వచ్చిన మిస్టర్ 360 తన పాత రికార్డులను చెరిపేసి, పాక్పై జెండా ఎగురవేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ గురించి చాలా చర్చలు జరిగాయి. దాదాపు 14 నెలల పాటు బ్యాట్ ఝులిపించడంలో తడబడిన సూర్య, కెప్టెన్గా తనపై ఉన్న ఒత్తిడిని అధిగమించి మళ్లీ గాడిలో పడ్డాడు. ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో, ఆ తర్వాత అమెరికాతో జరిగిన మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి విమర్శకుల నోళ్లు మూయించాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో బౌలర్లను భయపెడుతున్న సూర్య, ఇప్పుడు దాయాది దేశంపై తన ప్రతాపం చూపించాల్సిన సమయం ఆసన్నమైంది.
సూర్యకుమార్ యాదవ్ ప్రపంచంలోని అన్ని జట్లపై విరుచుకుపడతాడు కానీ, పాకిస్థాన్ విషయానికి వస్తే కథ మారుతోంది. గత రికార్డులు పరిశీలిస్తే పాక్పై సూర్య రికార్డు అంత ఆశాజనకంగా లేదు. పాకిస్థాన్తో ఆడిన 8 టి20 మ్యాచ్ల్లో సూర్య కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. పాక్ పేసర్లు సూర్యను కట్టడి చేయడంలో సఫలమవుతున్నారు. హరీస్ రవూఫ్ ఈసారి అందుబాటులో లేకపోయినా షాహీన్ అఫ్రిది, నసీమ్ షా వంటి పదునైన బౌలర్లను ఎదుర్కోవడం సూర్యకు పెద్ద సవాల్గా మారనుంది.
ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 15న జరిగే ఈ మ్యాచ్కు ఒక ప్రత్యేకత ఉంది. దశాబ్ద కాలంగా పాకిస్థాన్పై భారత్ సాధించిన విజయాల్లో విరాట్ కోహ్లీది సింహభాగం. కానీ ఈసారి విరాట్ లేకుండానే భారత్ బరిలోకి దిగుతోంది. దీంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై బాధ్యత రెట్టింపు అయ్యింది. అభిషేక్ శర్మకు అవకాశం ఇస్తారా? కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తెస్తారా? బుమ్రాను ఎప్పుడు ఉపయోగిస్తారు? వంటి వ్యూహాత్మక నిర్ణయాలతో పాటు, సూర్య స్వయంగా బ్యాట్తో మెరుపులు మెరిపిస్తేనే భారత్ 8-1తో తన రికార్డును మెరుగుపరుచుకోగలదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి