IND vs PAK Controversy: ఆసియా కప్‌లో వివాదాస్పద సైగలు.. కట్‌చేస్తే.. సూర్య, బుమ్రాలకు షాకిచ్చిన ఐసీసీ

Asia Cup 2025 Disciplinary Action: భారత్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్ (సెప్టెంబర్ 14), ఫైనల్ మ్యాచ్ (సెప్టెంబర్ 28) సందర్భంగా రౌఫ్ రెచ్చగొట్టే హావభావాలు (భారత ఫైటర్ జెట్‌లు కూలిపోయినట్లు సైగలు చేయడం) ప్రదర్శించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో రౌఫ్, దక్షిణాఫ్రికాతో పాకిస్థాన్ ఆడబోయే తదుపరి రెండు ODI మ్యాచ్‌లకు (నవంబర్ 4, 6) దూరం కానున్నాడు.

IND vs PAK Controversy: ఆసియా కప్‌లో వివాదాస్పద సైగలు.. కట్‌చేస్తే.. సూర్య, బుమ్రాలకు షాకిచ్చిన ఐసీసీ
Ind Vs Pak Controversy

Updated on: Nov 05, 2025 | 7:55 AM

Asia Cup 2025 Disciplinary Action: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ల సందర్భంగా చోటుచేసుకున్న క్రమశిక్షణా ఉల్లంఘనలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ పేసర్ హారీస్ రౌఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. అలాగే, టీమిండియా ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రాలకు డీమెరిట్ పాయింట్లు కేటాయిస్తూ ఐసీసీ నిర్ణయం ప్రకటించింది.

హారీస్ రౌఫ్‌పై నిషేధం ఎందుకు?

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హారీస్ రౌఫ్, ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల సందర్భంగా రెండు వేర్వేరు సందర్భాలలో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు తేలింది. ముఖ్యంగా, ‘ఆటకు చెడ్డ పేరు తెచ్చే ప్రవర్తన’కు సంబంధించిన ఆర్టికల్ 2.21ను ఉల్లంఘించినందుకుగాను అతనికి శిక్ష పడింది.

ఎవరికి ఏ శిక్ష..

రౌఫ్‌కు రెండు వేర్వేరు ఉల్లంఘనల కారణంగా మొత్తం నాలుగు డీమెరిట్ పాయింట్లు వచ్చాయి. దీంతో అతనికి రెండు సస్పెన్షన్ పాయింట్లు విధించారు. దీని ఫలితంగా రెండు వన్డే మ్యాచ్‌ల నిషేధం అమలవుతుంది. అలాగే, రెండు ఉల్లంఘనలకు గాను అతని మ్యాచ్ ఫీజులో 30% చొప్పున జరిమానా కూడా విధించారు.

నిషేధానికి అసలు కారణం..

భారత్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్ (సెప్టెంబర్ 14), ఫైనల్ మ్యాచ్ (సెప్టెంబర్ 28) సందర్భంగా రౌఫ్ రెచ్చగొట్టే హావభావాలు (భారత ఫైటర్ జెట్‌లు కూలిపోయినట్లు సైగలు చేయడం) ప్రదర్శించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో రౌఫ్, దక్షిణాఫ్రికాతో పాకిస్థాన్ ఆడబోయే తదుపరి రెండు ODI మ్యాచ్‌లకు (నవంబర్ 4, 6) దూరం కానున్నాడు.

సూర్యకుమార్ యాదవ్, బుమ్రాపై ఐసీసీ చర్యలు..

భారత జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్లపై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది.

సూర్యకుమార్ యాదవ్..

సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌పై విజయం సాధించిన అనంతరం, తన వ్యాఖ్యల్లో సరిహద్దు వివాదాలు, దేశ రక్షణ అంశాలను ప్రస్తావించినందుకు సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.21ను ఉల్లంఘించినట్లు తేలింది. దీంతో, అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించడంతో పాటు, రెండు డీమెరిట్ పాయింట్లను కేటాయించారు.

జస్‌ప్రీత్ బుమ్రా..

ఫైనల్ మ్యాచ్‌లో హారీస్ రౌఫ్‌ను అవుట్ చేసిన తర్వాత, రౌఫ్ గతంలో చేసిన సైగనే బుమ్రా తిరిగి చూపించడంతో, ఇది ఆటకు చెడ్డ పేరు తెచ్చే ప్రవర్తన కిందకు వస్తుందని ఐసీసీ పేర్కొంది. బుమ్రా తన తప్పును అంగీకరించడంతో, అతనికి అధికారిక హెచ్చరిక, ఒక డీమెరిట్ పాయింట్‌ను విధించారు.

ఇతర ఆటగాళ్లపైనా చర్యలు..

పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ కూడా సూపర్ 4 మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసిన తర్వాత ‘తుపాకీ కాల్పుల’ సెలబ్రేషన్‌కు పాల్పడ్డాడు. ఇది కూడా క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణించిన ఐసీసీ, ఫర్హాన్‌కు అధికారిక హెచ్చరిక, ఒక డీమెరిట్ పాయింట్‌ను జారీ చేసింది. అయితే, టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై వచ్చిన ఆరోపణలను మాత్రం ఐసీసీ తోసిపుచ్చింది.

ఈ పరిణామాలు క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..