Shardul Thakur : ఇక బ్యాగులు సర్దుకోవడం ఆపేయ్ శార్దూల్ భయ్యా.. హార్దిక్ నీకు పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేశాడు

Shardul Thakur : ఐపీఎల్ 2026లో కేకేఆర్‌పై శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లతో చెలరేగాడు. తన కెరీర్ ముగిసే వరకు శార్దూల్ ముంబై ఇండియన్స్‌లోనే ఉండాలని కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆకాంక్షించారు. శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్ కెరీర్ చూస్తే అతను ఇప్పటివరకు ఆరు వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.

Shardul Thakur : ఇక బ్యాగులు సర్దుకోవడం ఆపేయ్ శార్దూల్ భయ్యా.. హార్దిక్ నీకు పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేశాడు
Shardul Thakur

Updated on: Mar 30, 2026 | 9:52 AM

Shardul Thakur : ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసర్ శార్దూల్ ఠాకూర్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన హోమ్ గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో కేకేఆర్ బ్యాటర్లను వణికించాడు. ముఖ్యంగా కేకేఆర్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీస్తూ అజింక్య రహానే, ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్ వంటి కీలక వికెట్లు పడగొట్టి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. 39 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన శార్దూల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. తన బౌలింగ్‌తో కేకేఆర్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకోవడంలో శార్దూల్ సఫలమయ్యాడు.

హార్దిక్ పాండ్యా ఎమోషనల్ ప్రామిస్

మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా శార్దూల్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. “శార్దూల్ ఒక గొప్ప క్యారెక్టర్, అతనికి పెద్ద మనసుంది. బ్యాటర్లను ఎలా బోల్తా కొట్టించాలో అతడికి బాగా తెలుసు. నేను అతడితో ఒకటే చెప్పాను.. ఇక చాలు, ఫ్రాంచైజీలు మారడం ఆపేయ్. నీ కెరీర్ ముగిసే వరకు నువ్వు ముంబై ఇండియన్స్‌లోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను” అని హార్దిక్ తెలిపాడు. శార్దూల్ వంటి ఆటగాడు జట్టులో ఉండటం తమకు పెద్ద బలం అని పాండ్యా కొనియాడాడు.

శార్దూల్ ఐపీఎల్ ప్రయాణం

శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్ కెరీర్ చూస్తే అతను ఇప్పటివరకు ఆరు వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లలో అతను సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు తన సొంత నగరమైన ముంబై టీమ్‌లోకి రావడం అతడికి ఎంతో ప్రత్యేకం. గతంలో అంటే 2010 నుంచి 2012 వరకు శార్దూల్ ముంబై ఇండియన్స్ జట్టుకు నెట్ బౌలర్‌గా పనిచేశాడు. ఇప్పుడు అదే జట్టులో కీలక ఆటగాడిగా మారి మ్యాచ్‌ విన్నర్‌గా నిలవడం అతడికి ఒక మధుర జ్ఞాపకం.

సొంత గూటికి చేరిన వేళ..

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత శార్దూల్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. “ముంబై నా సొంత నగరం, ఇక్కడ ఆడటం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను లక్నో నుంచి ట్రేడ్ చేసుకుని, మొదటి మ్యాచ్‌లోనే అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్ కుటుంబానికి ధన్యవాదాలు. 15 ఏళ్ల క్రితం నేను ఇక్కడ నెట్ బౌలర్‌గా ఉన్నాను, ఇప్పుడు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటం గర్వంగా ఉంది. హార్దిక్ చెప్పినట్టు నా కెరీర్ ముగిసే వరకు ఇక్కడే ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను” అని శార్దూల్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా, వాంఖడే గ్రౌండ్ స్టాఫ్ పట్ల గౌరవార్థం హార్దిక్ పాండ్యా ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున చెక్కులను బహూకరించి తన ఉదారతను చాటుకున్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us