
SRH vs RCB : ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపు మ్యాచ్ల్లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న 67వ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాట్ కమిన్స్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెంగళూరు బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ స్టేడియంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించాలంటే 120 బంతుల్లో 256 పరుగులు చేయాల్సి ఉంది.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తొలి 3 ఓవర్లలోనే 33 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో 26 పరుగులు చేసి రసిఖ్ సలామ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఈషాన్ కిషన్తో కలిసి అభిషేక్ శర్మ ఆర్సీబీ బౌలర్లపై దండయాత్ర చేశాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్, మొత్తంగా 22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసి సుయాష్ శర్మ బౌలింగ్లో అవుటయ్యాడు. పవర్ప్లే ముగిసేసరికి హైదరాబాద్ ఒక వికెట్ నష్టానికి 63 పరుగులు సాధించింది.
అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ రన్ రేట్ ఎక్కడా తగ్గలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్ బాధ్యతాయుతమైన ఆటతీరుతో పాటు మెరుపు బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. బెంగళూరు బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ కేవలం 31 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఆఖరి వరకు క్రీజులో నిలబడి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న ఈషాన్ కిషన్ 78 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి పెవిలియన్ చేరాడు.
మిడిల్ ఓవర్లలో క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ పరుగుల వేగాన్ని మరింత పెంచాడు. ఈషాన్ కిషన్తో కలిసి విధ్వంసకర భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరి ధాటికి ఇన్నింగ్స్ 16వ ఓవర్లోనే హైదరాబాద్ జట్టు 200 పరుగుల మైలురాయిని దాటింది. కేవలం 5 ఓవర్ల వ్యవధిలోనే ఈ జోడి 81 పరుగులు రాబట్టడం విశేషం. క్లాసెన్ కేవలం 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి క్రునాల్ పాండ్యా బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆఖర్లో నితీష్ కుమార్ రెడ్డి 23 పరుగులతో నాటౌట్గా నిలిచి స్కోరును 255కు చేర్చాడు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు జట్టు 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో గెలిస్తే బెంగళూరుకు మొదటి స్థానంతో పాటు ఫైనల్కు వెళ్లడానికి రెండు అవకాశాలు లభిస్తాయి. మరోవైపు హైదరాబాద్ జట్టు కూడా ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. అయితే టేబుల్లో రెండో స్థానాన్ని అందుకోవాలంటే హైదరాబాద్ ఈ మ్యాచ్ను భారీ రన్ రేట్ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం గుజరాత్ జట్టు 0.695 నెట్ రన్ రేట్తో ముందంజలో ఉండగా, హైదరాబాద్ 0.350 రన్ రేట్తో ఉంది. ఈ మ్యాచ్లో 256 పరుగుల రక్షణ కోసం హైదరాబాద్ బౌలర్లు ఎలాంటి వ్యూహాలతో వస్తారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..