Virat Kohli : కొట్టలేనప్పుడు వెనక్కి పిలవాల్సింది.. విరాట్ కోహ్లీపై ప్రముఖ కామెంటర్ సంచలన వ్యాఖ్యలు

Virat Kohli : ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరుపై ప్రముఖ కామెంటేటర్ సైమన్ డౌల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. కోహ్లీని రిటైర్డ్ అవుట్ చేసి ఉండాల్సిందంటూ ఆయన చేసిన సూచన అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.

Virat Kohli : కొట్టలేనప్పుడు వెనక్కి పిలవాల్సింది.. విరాట్ కోహ్లీపై ప్రముఖ కామెంటర్ సంచలన వ్యాఖ్యలు
Virat Kohli

Updated on: Apr 13, 2026 | 11:22 AM

Virat Kohli : ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ మిశ్రమంగా సాగింది. మొదట్లో 11 బంతుల్లో 20 పరుగులు చేసిన కోహ్లీ, ఆ తర్వాత ముంబై బౌలర్ల వ్యూహాలకు చిక్కి పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు. చివరికి 37 బంతుల్లో 50 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆయన స్ట్రైక్ రేట్ 131.58 గా నమోదైంది. మరోవైపు, రజత్ పాటిదార్ కేవలం 20 బంతుల్లోనే 53 పరుగులు చేస్తూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న సైమన్ డౌల్.. కోహ్లీ సరిగ్గా ఆడలేకపోతున్నాడు కాబట్టి, ఆయనను రిటైర్డ్ అవుట్ చేసి టిమ్ డేవిడ్ వంటి హిట్టర్‌ను పంపాల్సిందిగా ఆర్‌సీబీకి సూచించారు.

అసలు రిటైర్డ్ అవుట్ అంటే ఏమిటి?

క్రికెట్ నిబంధనల ప్రకారం.. ఒక బ్యాటర్ గాయపడకుండానే, వ్యూహాత్మక కారణాల వల్ల స్వచ్ఛందంగా పెవిలియన్‌కు వెళ్లడాన్ని రిటైర్డ్ అవుట్ అంటారు. ఇలా వెళ్లిన బ్యాటర్ మళ్లీ ఆ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడానికి వీలుండదు. టీ20 క్రికెట్‌లో రన్ రేట్ పెరగడం లేదని భావించినప్పుడు, స్లోగా ఆడుతున్న బ్యాటర్‌ను వెనక్కి పిలిచి హిట్టర్లను పంపడం ఇప్పుడు ఒక వ్యూహంగా మారుతోంది. మొన్నటి మ్యాచ్‌లో కూడా సీఎస్‌కే జట్టు ఆయుష్ మాత్రేను వెనక్కి పిలిచి శివం దూబేను పంపింది, ఇది వారికి బాగా కలిసి వచ్చింది.

కోహ్లీ విషయంలో విమర్శలు ఎందుకు?

విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాడిని అలా వెనక్కి పిలవడం ఆయనను అవమానించడమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 2024 నుంచి కోహ్లీ తన స్ట్రైక్ రేట్‌ను గణనీయంగా మెరుగుపరుచుకున్నారు, కానీ ఆదివారం నాటి ఇన్నింగ్స్ పాత రోజులను గుర్తుచేసింది. కోహ్లీ ఎప్పుడూ ఐపీఎల్‌లో రిటైర్డ్ అవుట్ కాలేదు. కానీ సైమన్ డౌల్ మాత్రం.. “పాటిదార్ కోహ్లీకి ఒక మెసేజ్ పంపాలి.. నువ్వు వేగం పెంచు లేదంటే మేము నిన్ను సబ్ అవుట్ చేస్తాం అని చెప్పాలి” అంటూ లైవ్ కామెంటరీలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిపుణుల వాదన

టి20 క్రికెట్ ఇప్పుడు చాలా క్రూరంగా మారుతోందని, ఇక్కడ పేర్లు ముఖ్యం కాదు, పరుగులు ముఖ్యం అని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ, విరాట్ కోహ్లీ వంటి మ్యాచ్ విన్నర్‌ను 30 బంతులు ఆడిన తర్వాత వెనక్కి పిలవడం అనేది ఏ కెప్టెన్‌కు కూడా సాధ్యం కాని పని. దీనిపై ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ భవిష్యత్తులో కోహ్లీ ఇలాగే స్లోగా ఆడితే, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? అనే చర్చకు సైమన్ డౌల్ బీజం వేశారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us