
Shubman Gill: శ్రీలంకతో జరగబోయే ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్కు ముందు టీమిండియా యాజమాన్యానికి, అభిమానులకు బిగ్ రిలీఫ్ లభించింది. శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ చివరి రోజున భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ అనూహ్యంగా బ్యాటింగ్కు దిగాడు. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా కుడిచేతి ఉంగరం వేలికి గాయం కావడంతో గిల్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే గాయం నుంచి త్వరగా కోలుకున్న గిల్, కొలంబోలోని నాన్డెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ మైదానంలో నెట్స్ ప్రాక్టీస్ పూర్తి చేసుకుని, రెండో ఇన్నింగ్స్లో 207 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టుకు ఓపెనర్గా బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగాడు.
అసలు ప్రాక్టీస్ మ్యాచ్ నిబంధన ఏమిటి?
సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్లలో టాస్ సమయంలో ప్రకటించిన తుది జట్టు మాత్రమే ఆడేందుకు అర్హత కలిగి ఉంటుంది. కానీ వార్మప్ లేదా ప్రాక్టీస్ మ్యాచ్లకు ఈ అధికారిక నిబంధన వర్తించదు. ప్రాక్టీస్ మ్యాచ్లలో రెండు జట్లు తమ స్క్వాడ్లోని ఆటగాళ్లందరినీ మైదానంలోకి దించే సౌలభ్యం ఉంటుంది. ఏ ఆటగాడైనా ఏ సమయంలోనైనా బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయడానికి దిగవచ్చు. తొలి రెండు రోజులు గిల్ను ఆడించకూడదని బీసీసీఐ భావించినప్పటికీ, మెడికల్ టీమ్ అతని ఫిట్నెస్ను ధృవీకరించడంతో, గాళ్ వేదికగా జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్కు ముందు అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు టీమ్ మేనేజ్మెంట్ గిల్ను రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దింపింది.
కేఎల్ రాహుల్ కెప్టెన్సీ
నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒకసారి, ఆ తర్వాత స్లిప్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మరోసారి బంతి గిల్ కుడిచేతి వేలికి బలంగా తాకింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా బీసీసీఐ మెడికల్ టీమ్ అతనికి విశ్రాంతినిచ్చింది. ఈ క్రమంలో ప్రాక్టీస్ మ్యాచ్ టాస్ సమయంలో కేఎల్ రాహుల్ టీమిండియా తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించాడు. మొదటి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్గా వచ్చి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే చివరి రోజు గిల్ తిరిగి బ్యాటింగ్కు రావడం లంక టెస్టు సిరీస్ ముందు టీమిండియాకు పెద్ద ఊరటగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..