IPL 2026 : శ్రేయాస్ అయ్యర్ సోదరికి సోషల్ మీడియాలో వేధింపులు.. ట్రోలర్లకు గట్టి బుద్ధి చెప్పిన శ్రేష్ఠ

IPL 2026 : పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ ఐపీఎల్ ట్రోలింగ్‌ పై తీవ్రంగా స్పందించారు. కేకేఆర్ మ్యాచ్ రద్దయినప్పుడు చేసిన సరదా వీడియో పై వచ్చిన వ్యక్తిగత దూషణ లను ఆమె గట్టిగా ఖండించారు.

IPL 2026 : శ్రేయాస్ అయ్యర్ సోదరికి సోషల్ మీడియాలో వేధింపులు.. ట్రోలర్లకు గట్టి బుద్ధి చెప్పిన శ్రేష్ఠ
Shreyas Iyers Sister Shresta

Updated on: May 26, 2026 | 10:00 AM

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సోదరి, వృత్తిరీత్యా కొరియోగ్రాఫర్ అయిన శ్రేష్ఠ అయ్యర్ తీవ్రమైన సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురైంది. అసలు ఏం జరిగిందంటే.. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరగాల్సిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ నేపథ్యంలో శ్రేష్ఠ పంజాబ్ కింగ్స్ జెర్సీ వేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సరదా వీడియో పోస్ట్ చేసింది. అందులో పంజాబీ స్టైల్లో.. “మా పంజాబీలకు గుండె చాలా పెద్దది.. తీసుకోండి, మీకు ఒక పాయింట్ దానం ఇచ్చాం” అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించింది.

ఈ ఫన్నీ వీడియోపై కేకేఆర్ అభిమానులు, కొంతమంది నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ రావడంతో శ్రేష్ఠ ఆ వీడియోను డిలీట్ చేయాల్సి వచ్చింది. మరోవైపు, ఈ సీజన్‌లో వరుసగా మొదటి 7 మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయి ప్లేఆఫ్స్ రేసు నుంచి తృటిలో తప్పుకుంది. పంజాబ్ జట్టు టోర్నీ నుంచి అవుట్ అవ్వగానే ట్రోలర్లు మళ్లీ శ్రేష్ఠను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.

ట్రోలింగ్ మరీ హద్దులు దాటడంతో శ్రేష్ఠ తాజాగా రెండు భాగాల వీడియోను విడుదల చేసి గట్టి కౌంటర్ ఇచ్చింది. “ఆ రీల్ కేవలం ఒక సరదా సంభాషణ కోసం మాత్రమే చేశాను. ఎవరినీ కించపరచాలనో, ద్వేషాన్ని పెంచాలనో నాకు ఎలాంటి చెడ్డ ఉద్దేశాలు లేవు. నా సోదరుడు కూడా ఒక క్రికెటరే, కాబట్టి నాకు ప్రతి క్రికెటర్ పట్ల అపారమైన గౌరవం ఉంది. కానీ కొందరు నా వర్క్‌ప్లేస్‌కు ఫోన్లు చేస్తూ, నా సహోద్యోగులను, నా స్టూడెంట్స్‌ను, నా కుటుంబాన్ని బూతులు తిడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం?” అని ప్రశ్నించింది.

తన తమ్ముడు శ్రేయాస్ అయ్యర్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటానని శ్రేష్ఠ స్పష్టం చేసింది. “అతను మ్యాచ్‌లు గెలిచినా, ఓడినా.. నేను ఎప్పుడూ అతని విజయాలను సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాను. ఆటలో గెలుపోటములు సహజం. కానీ దాన్ని పట్టుకుని ఆటగాళ్ల కుటుంబాలను టార్గెట్ చేయడం, వ్యక్తిగతంగా దూషించడం అస్సలు కరెక్ట్ కాదు” అంటూ ట్రోలర్ల తీరును తీవ్రంగా తప్పుపట్టింది.

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన పంజాబ్ కింగ్స్ చివరి మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు. వరుస ఓటములకు బ్రేక్ వేస్తూ కేవలం ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్ 101 పరుగులతో అజేయ సెంచరీ సాధించి, జట్టుకు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. అయినప్పటికీ, పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 15 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ అవకాశాన్ని కోల్పోయింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us