
Sanju Samson: సమాధానం ఎప్పుడూ నోటితో కాదు చేసే పనిలో ఉండాలని అంటారు పెద్దలు. ప్రస్తుతం టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ విషయంలో ఇదే అక్షరాల నిజమైంది. కొన్ని రోజుల క్రితం వరకు అసలు ప్లేయింగ్-11లో చోటు దక్కుతుందా లేదా అన్న సందిగ్ధంలో ఉన్న సంజూ, ఇప్పుడు అదే జట్టును సెమీఫైనల్కు చేర్చి తన విమర్శకుల నోళ్లు మూయించాడు. ముఖ్యంగా సంజూను జట్టులోకి తీసుకోవడంపై వెటకారంగా నవ్విన కెప్టెన్ సూర్యకుమార్ యాదవే, ఇప్పుడు అతడి ముందు తలవంచక తప్పలేదు. తన ఆటతో సంజూ సృష్టించిన ఈ ప్రభంజనం ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది.
కోల్కతా వేదికగా మార్చి 1న వెస్టిండీస్తో జరిగిన కీలక నౌకౌట్ పోరులో సంజూ శాంసన్ అసలైన విశ్వరూపం ప్రదర్శించాడు. విండీస్ విసిరిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ బ్యాటర్లు త్వరగానే పెవిలియన్ చేరారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు మొక్కవోని ధైర్యంతో సంజూ ఒంటరి పోరాటం చేశాడు. కేవలం మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ, 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ ప్రపంచకప్లో తనకు లభించిన మూడవ మ్యాచ్లోనే జట్టును ఆదుకుని హీరోగా నిలిచాడు.
What a win! 🇮🇳
Congratulations to Team India on their outstanding victory against West Indies and for securing a place in the semi-finals.
Wishing our #MenInBlue continued success in the matches ahead. pic.twitter.com/JJeBM4wC2X
— Smriti Z Irani (@smritiirani) March 1, 2026
నిజానికి సంజూ శాంసన్కు ఈ అవకాశం అంత సులభంగా రాలేదు. గ్రూప్ దశలో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వరుసగా విఫలమవుతున్నా సంజూను పక్కన పెట్టారు. సూపర్ 8లో సౌతాఫ్రికాతో మ్యాచ్కంటే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక జర్నలిస్ట్ “సంజూను ఓపెనర్గా గానీ లేదా మూడవ స్థానంలో గానీ ఆడిస్తారా?” అని అడిగిన ప్రశ్నకు కెప్టెన్ సూర్య నవ్వుతూ వెటకారంగా జవాబిచ్చాడు. “అభిషేక్ లేదా తిలక్ని పక్కన పెట్టేయమంటారా? ప్రస్తుతం జరుగుతున్నది బాగానే ఉంది, దీన్నే కొనసాగిద్దాం” అంటూ ఎగతాళి చేశాడు. కానీ సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి.
ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో తప్పనిసరి పరిస్థితుల్లో సంజూను జట్టులోకి తీసుకున్నారు. ఇక వెస్టిండీస్తో జరిగిన నిర్ణయాత్మక పోరులో కెప్టెన్ సూర్య త్వరగా అవుట్ అయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న వేళ, సంజూ శాంసన్ తన అద్భుత బ్యాటింగ్తో జట్టును గెలిపించి కెప్టెన్ను గండం నుంచి గట్టెక్కించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన టోపీ తీసి సంజూకు సెల్యూట్ చేయడం విశేషం. ఇది కేవలం గౌరవం మాత్రమే కాదు, గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఒక రకమైన పశ్చాత్తాపంలా అనిపించింది. ఇప్పుడు సంజూ శాంసన్ అభిమానులు “అవమానించిన చోటే సన్మానం పొందడం అంటే ఇదే” అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..