
ఐపీఎల్ 2026 మినీ వేలం దగ్గర పడుతుండటంతో ఆటగాళ్ల ట్రేడ్ డీల్స్కు సంబంధించి రోజురోజుకీ కొత్త పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పలువురు సీనియర్ ఆటగాళ్లు తమ జట్లను మారే అవకాశం ఉందని గట్టిగా స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే ఫ్రాంచైజీలు రాబోయే మెగా వేలం వరకు జట్టు కూర్పును మార్చేందుకు వీలు లేకుండా వ్యూహాలు రచించినట్టు సమాచారం.
ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ట్రేడ్ డీల్కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. రాజస్థాన్ జట్టు గట్టి డిమాండ్లు పెట్టడంతో ఈ డీల్ ఇంకా కొలిక్కి రాలేదు. ప్రస్తుతానికైతే.. ఢిల్లీ జట్టులోకి సంజూ శాంసన్ వస్తుండగా.. అతడి ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్కు స్టబ్స్తో మరో దక్షిణాఫ్రికా అన్ క్యాప్డ్ ప్లేయర్ వెళ్తాడని సమాచారం. అటు వాషింగ్టన్ సుందర్ చెన్నై సూపర్ కింగ్స్కు మారే అవకాశం ఉందని కీలక అప్డేట్ వచ్చింది. గుజరాత్ టైటాన్స్తో చెన్నై ఈ ట్రేడ్ డీల్పై చర్చిస్తోంది. సీఎస్కేకు అశ్విన్ స్థానంలో ఒక ఆఫ్-స్పిన్నర్ అవసరం ఉంది. సుందర్ ధర తక్కువ ఉండటంతో.. అలాగే చెన్నై అతడి హోం గ్రౌండ్ కావడంతో అతడిపై ఆసక్తి చూపుతోంది.
ఇక కోల్కతా నైట్ రైడర్స్ వెంకటేశ్ అయ్యర్ను ట్రేడ్ చేసుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీ వెంకటేశ్ అయ్యర్ పట్ల ఆసక్తిగా ఉంది. ఇషాన్ కిషన్ కోసం కేకేఆర్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఆసక్తి చూపుతున్నాయి. గ్లెన్ మ్యాక్స్వెల్ ట్రేడ్పై కూడా వార్తలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని తీసుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా చెపాక్ పిచ్పై ఆల్-రౌండర్గా అతని బౌలింగ్ ప్రభావవంతంగా ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ కూడా మ్యాక్స్వెల్ పట్ల ఆసక్తి చూపుతోంది. మరి పంజాబ్ కింగ్స్ మ్యాక్స్వెల్ను వదులుకోవడానికి సిద్ధంగా ఉందో లేదో చూడాలి.