వాడొక హీరో రా.. వాడికే అన్యాయం చేస్తారా? అజింక్యా రహానె ఆన్ ఫైర్..

జింబాబ్వే టీ20 పర్యటనకు ప్రకటించిన భారత జట్టు నుండి ఆ ప్లేయర్‌ను తప్పించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. టీ20 ప్రపంచకప్ 2026లో కీలక పాత్ర పోషించిన సంజును పక్కన పెట్టడంపై సీనియర్ ఆటగాడు అజింక్య రహానే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సెలెక్టర్ల నిర్ణయాన్ని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు తప్పుబడుతున్నారు.

వాడొక హీరో రా.. వాడికే అన్యాయం చేస్తారా? అజింక్యా రహానె ఆన్ ఫైర్..
Ajinkya Rahane

Updated on: Jul 07, 2026 | 4:08 PM

జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో వికెట్‌కీపర్-బ్యాటర్ సంజూ సామ్సన్‌కు చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడిని అకస్మాత్తుగా పక్కన పెట్టడంపై టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకునే ముందు సంజూ సామ్సన్‌తో కనీసం మాట్లాడి ఉంటారని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించిన రహానే, “సంజూ శాంసన్‌తో ఈ విషయంపై కనీసం మాట్లాడి ఉంటారని ఆశిస్తున్నాను. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌ హీరోగా ఉన్న ప్లేయర్‌ని జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అతడు త్వరలోనే మళ్లీ భారత జట్టులోకి రావాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నాడు. రహానే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు కూడా సంజూను జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదని అంటున్నారు. గత కొంతకాలంగా అవకాశాలు దక్కినప్పుడల్లా మంచి ప్రదర్శన చేసిన సంజూకు ఈ నిర్ణయం నిరాశ కలిగించిందని అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా భారత సెలెక్టర్లు, జూలై 6న జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. శ్రేయాస్ అయ్యర్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కాగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తూ అశోక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, యశ్ ఠాకూర్‌లకు తొలిసారి జాతీయ జట్టులో అవకాశం కల్పించారు. అలాగే ఇంగ్లాండ్ సిరీస్‌లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో భారత్ మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్ జూలై 23న, రెండో మ్యాచ్ జూలై 25న, మూడో మ్యాచ్ జూలై 26న హరారే వేదికగా జరుగనున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us