పొమ్మనలేక పొగబెడుతున్నారు.. ఆ 3గురు సీనియర్లు ఔట్.. విధ్వంసకర ఓపెనర్ రీఎంట్రీ.. కెప్టెన్‌గా హార్దిక్?

శ్రీలంక టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టాలని బీసీసీఐ యోచిస్తోందట. ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్ 2024ను దృష్టిలో ఉంచుకుని యువ ప్లేయర్స్‌ను..

పొమ్మనలేక పొగబెడుతున్నారు.. ఆ 3గురు సీనియర్లు ఔట్.. విధ్వంసకర ఓపెనర్ రీఎంట్రీ.. కెప్టెన్‌గా హార్దిక్?
India Vs Srilanka

Updated on: Dec 26, 2022 | 5:26 PM

2022 ముగిసింది. ఈ ఏడాది టీమిండియా పలు చెప్పుకోదగ్గ విజయాలు అందుకోగా.. కొన్ని సంచలన ఓటములు కూడా చవి చూసింది. ఏదైతేనేం ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించి టీమిండియా ఈ ఇయర్‌కు హ్యాపీ ఎండింగ్ ఇచ్చింది. ఇక వచ్చే ఏడాది జనవరిలో స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల్లో భారత్ తలబడనుంది. శ్రీలంక జట్టు భారత్ పర్యటన జనవరి 3న జరగబోయే తొలి టీ20తో ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే.. శ్రీలంక టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టాలని బీసీసీఐ యోచిస్తోందట. ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్ 2024ను దృష్టిలో ఉంచుకుని యువ ప్లేయర్స్‌ను సన్నద్ధం చేయాలనుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగానే విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ సిరీస్‌కు దూరంగా ఉంచాలని భావిస్తోందట. ఇక మరోసారి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు టీమిండియా కెప్టెన్సీ పగ్గాలను అప్పగించనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు జాతీయ మీడియాతో పేర్కొన్నారు. అటు కొత్త సెలక్షన్ కమిటీ కూడా పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు ఆసక్తి చూపుతోందట.

ప్రస్తుతం బొటన వేలి గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మ శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగానే ఉంది. అతడు ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో తగినంత విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అలాగే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల కోసం విరాట్ కోహ్లీని, ప్రేయసిని పెళ్లి చేసుకోబోతున్నట్లు కెఎల్ రాహుల్ ముందే బీసీసీఐకి సమాచారం ఇవ్వడంతో.. టీమిండియా టాప్ 3.. ఇప్పుడు శ్రీలంక సిరీస్‌కు దూరం కానున్నారు. పొమ్మనలేక పొగపెడుతున్నట్లు.. శ్రీలంక సిరీస్‌తో టీ20 జట్టు నుంచి సీనియర్ ఆటగాళ్లను సెండ్ ఆఫ్ చేయాలని చూస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తొలి అడుగుగా శ్రీలంకపై యువ జట్టును రంగంలోకి దింపేందుకు బీసీసీఐ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది.

ఇదిలా ఉంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫామ్ లేమితో సతమతమవుతున్న పంత్ స్థానంలో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోనే అవకాశం ఉందట. అటు స్టార్‌ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా కూడా టీ20 జట్టులోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక యువ ఆటగాడు పృథ్వీ షా.. కెఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, శ్రీలంక సిరీస్‌కు భారత్ జట్టును డిసెంబర్ 27న బీసీసీఐ ప్రకటించనుంది.