
Rishabh Pant : టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పంత్ ఏ కష్టంలో ఉన్నా, కెరీర్ పరంగా ఏ సలహా కావాలన్నా వెంటనే రాంచీలోని ధోనీ ఇంటికి చెక్కేస్తుంటాడు. ధోనీని తన గురువుగా భావించే పంత్, తాజాగా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. తానెప్పుడూ ధోనీకి ఫోన్ చేయనని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ తాజాగా ఒక న్యూస్ ఛానెల్తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ధోనీ మీ ఫోన్ ఎత్తుతారా? అని అడిగిన ప్రశ్నకు పంత్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. “నేను అసలు ఆయనకు ఫోనే చేయను. నేను ఫోన్ను చాలా తక్కువగా ఉపయోగిస్తాను. నిజానికి ఈ అలవాటును నేను ధోనీ నుంచే నేర్చుకున్నాను” అని తెలిపాడు. ధోనీ కూడా ఫోన్లకు దూరంగా ఉంటారని, ఎవరైనా ఆయనను కలవాలంటే నేరుగా వెళ్లాల్సిందే తప్ప ఫోన్ ద్వారా సాధ్యం కాదని పంత్ గుర్తు చేశాడు. వర్తమానంలో బ్రతకడం, గ్యాడ్జెట్లకు దూరంగా ఉండటం తన మానసిక ప్రశాంతతకు కారణమని పంత్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ గురించి కూడా పంత్ తన విశ్లేషణను ఇచ్చాడు. భారత్ ఈసారి కప్పు గెలవడానికి 90 శాతం అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశాడు. టీమ్ ఇండియా చాలా బలంగా ఉందని, అయితే టీ20 ఫార్మాట్లో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయలేమని అన్నాడు. పంత్ అంచనా ప్రకారం.. భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీ ఫైనల్కు చేరుతాయని చెప్పాడు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంచలనాలు సృష్టిస్తుందని, వారిని తక్కువ అంచనా వేయడం ప్రత్యర్థులకు ప్రమాదమని హెచ్చరించాడు.
2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో రిషబ్ పంత్ కీలక సభ్యుడు. అయితే ఈసారి గాయం కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చి అద్భుతంగా రాణిస్తున్నాడు. తాను మైదానంలో లేకపోయినా, భారత్ మళ్ళీ విశ్వవిజేతగా నిలవాలని పంత్ కోరుకుంటున్నాడు. ప్రస్తుతం తన ఫిట్నెస్పై దృష్టి సారించిన పంత్, త్వరలోనే పూర్తిస్థాయిలో మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఫోన్లకు దూరంగా ఉంటూ తన రిహాబిలిటేషన్ ప్రక్రియను సీరియస్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి