T20 World Cup: భారత్‌తో మ్యాచ్ ఆడకున్నా.. ఈజీగా పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.! ఎలాగంటే.?

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించినా సెమీస్‌కు చేరే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఐసీసీ చర్యలు, భారీ ఆర్థిక నష్టంతో పాటు, ఒకే వేదికపై మ్యాచ్‌లు, శ్రీలంక వాతావరణ పరిస్థితులు, స్పిన్‌కు అనుకూల వికెట్లు పాకిస్థాన్‌కు కలిసిరానున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

T20 World Cup: భారత్‌తో మ్యాచ్ ఆడకున్నా.. ఈజీగా పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.! ఎలాగంటే.?
Pakistan In T20 Wc 2026

Updated on: Feb 05, 2026 | 1:44 PM

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026 టోర్నీకి రంగం సిద్ధమైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా హోస్ట్ చేస్తోన్న ఈ మెగా టోర్నీకి ఇంకా రెండు రోజుల్లో తెరలేవనుంది. టోర్నీ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ ఒక కీలక ప్రకటనతో వార్తల్లో నిలిచింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఐసీసీకి ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వనప్పటికీ, ఈ ప్రకటన తీవ్ర చర్చకు దారితీసింది.

పాకిస్థాన్ నిర్ణయంపై ఐసీసీ ఘాటుగా స్పందించింది. వరల్డ్ కప్‌లో ఒక టీమ్‌తో మాత్రమే ఆడము అని చెప్పడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల కలిగే పరిణామాల గురించి ఆలోచించాలని పాకిస్థాన్‌ను హెచ్చరించింది. ఒకవేళ మ్యాచ్ బహిష్కరిస్తే కఠిన ఆంక్షలు విధించాల్సి ఉంటుందని, పాకిస్థాన్ మ్యాచ్ ఆడకుండానే రెండు పాయింట్లు కోల్పోతుందని, వాకోవర్‌గా భావించి భారత్‌ను విజేతగా ప్రకటిస్తారని పేర్కొంది. భారత-పాక్ మ్యాచ్ జరగకపోతే రూ. 4500 కోట్ల భారీ బిజినెస్ దెబ్బ తిననుందని వార్తలు వచ్చాయి.

అయితే, క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్ బాయ్‌కాట్ చేసినా ఆ టీమ్ ఈజీగా సెమీఫైనల్ చేరుతుందని అంటున్నారు. తమ మ్యాచ్‌లన్నింటినీ ఒకే వేదికగా ఆడటం పాకిస్థాన్‌కు కలిసివచ్చే అతిపెద్ద అంశమని విశ్లేషకులు చెప్తున్నారు. పాకిస్థాన్ తమ మ్యాచ్‌లను శ్రీలంకలోని రెండు గ్రౌండ్స్‌లోనే ఆడనుంది. దీనివల్ల ఆటగాళ్లకు ప్రయాణ అలసట ఉండదు, పిచ్ కండిషన్స్ పూర్తిగా అర్థమవుతాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ కూడా ఇలానే దుబాయ్ వేదికగా తమ అన్ని మ్యాచ్‌లను ఆడి విజేతగా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

శ్రీలంక వెదర్ కండిషన్స్ పాకిస్థాన్‌కు కొత్త కాదు. ఇప్పటికే ఇక్కడ అనేకసార్లు ఆడి ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచింది. స్పిన్‌కు అనుకూలంగా ఉండే ఈ వికెట్లు పాకిస్థాన్‌కు అనుకూలించనున్నాయని అంచనా. పాకిస్థాన్ గ్రూప్ Aలో భారత్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికాతో ఉంది. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో మొదటి మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్, ఫిబ్రవరి 10న అమెరికాతో, ఫిబ్రవరి 15న భారత్‌తో, ఫిబ్రవరి 18న నమీబియాతో తలపడనుంది. భారత్‌తో మ్యాచ్ ఆడకున్నా అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌తో విజయం సాధిస్తే పాకిస్థాన్ సూపర్-8 దశకు చేరుతుంది.

సూపర్-8లో భారత్‌తో పాకిస్థాన్ తలపడే అవకాశం ఉండదు. లీగ్ దశలో ఈ రెండు జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నందున, సూపర్-8లో వేర్వేరు గ్రూపుల్లో ఆడతాయి. అక్కడ కూడా పాకిస్థాన్, భారత్ విజయాలు సాధిస్తే సెమీఫైనల్ లేదా ఫైనల్‌లోనే తలపడే అవకాశం ఉంది. ఏది ఏమైనా, భారత్‌తో మ్యాచ్ ఆడకపోయినా పాకిస్థాన్ సునాయాసంగా సెమీఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇది చదవండి: నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్.! గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాదే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి