Champions Trophy: ఇండియాతో మ్యాచ్‌ ఓడినా పర్వాలేదు.. కానీ! పాక్‌ వైస్‌ కెప్టెన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

ఈ నెల 19 నుంచి ప్రారంభం కాబోతున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో అంతా ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మ్యాచ్‌పై పాకిస్థాన్‌ వైస్‌ కెప్టెన్‌ అఘా సల్మాన్‌ స్పందిస్తూ.. ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. అతను ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Champions Trophy: ఇండియాతో మ్యాచ్‌ ఓడినా పర్వాలేదు.. కానీ! పాక్‌ వైస్‌ కెప్టెన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Ind Vs Pak

Updated on: Feb 16, 2025 | 3:11 PM

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న మ్యాచ్‌ ఏదైనా ఉందంటే అది ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌. మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భారత్‌ – పాక్‌ జట్లు తలపడనున్నాయి. ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ న్యూజిలాండ్‌తో ఆడుతుంది. అలాగే టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇక ఇండియా – పాక్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌, పాక్‌ రెండు దేశాల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లు ఎప్పుడో హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇండియా-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఎంత క్రేజ్‌ ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాగే ఆటగాళ్లపై కూడా భారీ ఒత్తిడి ఉంటుంది. కచ్చితంగా గెలిచి తీరాలని ఇరు దేశాల అభిమానులు కూడా కోరుకుంటారు. గెలిచిన వాళ్లు సంబురాలు చేసుకుంటే.. ఓడిన వాళ్లు తీవ్ర నిరాశలో కూరుకుపోతారు. పైగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేనందున కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లోనే పాల్గొంటున్నాయి. దీంతో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే ఉండే కిక్‌ మరింత పెరిగిందని చెప్పవచ్చు. అయితే.. తాజాగా ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ గురించి పాక్‌ వైస్‌ కెప్టెన్‌ అఘా సల్మాన్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ సల్మాన్‌ భట్‌తో జరిగిన చిట్‌చాట్‌లో ఇండియాతో మ్యాచ్‌ అంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందనే ప్రశ్నకు సందిస్తూ.. ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ప్రపంచం మొత్తం స్పెషల్‌గా చూస్తుంది. అలాగే ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుంది. కానీ, అంతిమంగా అదో మ్యాచ్‌ మాత్రమే. ఒక వేళ మేం ఇండియాపై గెలిచి, ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలవకపోవతే.. ఆ విజయంతో ఉపయోగం లేదు. అలా కాకుండా ఒక వేళ మేం ఇండియాపై ఓడిపోయినా కానీ ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిస్తే మాత్రం అది నా దృష్టిలో పెద్ద విషయం అవుతుందని అఘా సల్మాన్‌ వెల్లడించాడు. అయితే తాము ఇండియాపై గెలవడంతో పాటు ఛాంపియన్స్‌ ట్రోఫీ కూడా గెలవాలని కోరుకుంటున్నట్లు సల్మాన్‌ పేర్కొన్నాడు. అయితే టీమిండియాను ఓడించే సత్తా పాకిస్థాన్‌కు లేదంటూ భారత క్రికెట్‌ అభిమానులు పాక్‌ వైస్‌ కెప్టెన్‌కు కౌంటర్‌ ఇస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.