ODI World Cup 2027 : జై షా నిర్ణయంపై భగ్గుమన్న నలుగురు కెప్టెన్లు.. ఐసీసీ కొత్త ఫార్మాట్‌పై తీవ్ర ఆగ్రహం

ODI World Cup 2027 : 2027 వన్డే ప్రపంచకప్ కొత్త ఫార్మాట్‌పై తీవ్ర వివాదం నెలకొంది. ఐసీసీ చైర్మన్ జై షా నిర్ణయాన్ని నమీబియా, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్ కెప్టెన్లు బహిరంగంగా విమర్శించారు. అసోసియేట్ జట్ల అవకాశాలను తగ్గించే ఈ మార్పులపై క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చ కొనసాగుతోంది.

ODI World Cup 2027 : జై షా నిర్ణయంపై భగ్గుమన్న నలుగురు కెప్టెన్లు.. ఐసీసీ కొత్త ఫార్మాట్‌పై తీవ్ర ఆగ్రహం
Jay Shah

Updated on: Jul 17, 2026 | 8:24 PM

ODI World Cup 2027 : 2027 వన్డే ప్రపంచకప్ ఫార్మాట్‌లో ఐసీసీ తీసుకున్న హఠాత్తు నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఐసీసీ నూతన చైర్మన్ జై షా నేతృత్వంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మార్పులను ప్రకటించారు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల వేదికగా జరగబోయే ఈ మెగా టోర్నీ రూల్స్ మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా క్రికెట్‌లో ఎదుగుతున్న చిన్న దేశాలకు ఈ నిర్ణయం తీవ్ర నష్టం కలిగిస్తుండటంతో, నలుగురు అంతర్జాతీయ జట్ల కెప్టెన్లు ఐసీసీ వైఖరిపై బహిరంగంగానే తమ భగ్గుమన్నారు.

నిజానికి 2027 వన్డే ప్రపంచకప్‌ను 14 జట్లతో నిర్వహించనున్నట్లు ఐసీసీ గతంలో ప్రకటించింది. అయితే తాజాగా చేసిన మార్పుల ప్రకారం ఈ 14 జట్లలో కేవలం 12 జట్లకు మాత్రమే ప్రధాన గ్రూప్ స్టేజ్ రౌండ్‌లోకి నేరుగా ఎంట్రీ లభిస్తుంది. ర్యాంకింగ్స్ లేదా క్వాలిఫికేషన్స్ ఆధారంగా ఆఖరి స్థానాల్లో నిలిచే చివరి 3 జట్ల మధ్య ప్రత్యేకంగా ఒక క్వాలిఫైయర్ సిరీస్ నిర్వహిస్తారు. ఈ ముగ్గురిలో కేవలం ఒకే ఒక్క జట్టుకు మాత్రమే మెయిన్ టోర్నీ ఆడే అవకాశం లభిస్తుంది, మిగిలిన 2 జట్లు టోర్నీ ప్రారంభానికి ముందే ఇంటిబాట పడతాయి. ఈ నిర్ణయం వల్ల కష్టపడి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన అసోసియేట్ జట్లు.. టోర్నీలో పూర్తి స్థాయిలో ఆడకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో 2003 వరల్డ్ కప్ తరహాలో అన్ని 14 జట్లూ గ్రూప్ స్టేజ్ ఆడుతాయని భావించినా, ఐసీసీ ఆ ఆశలపై నీళ్లు చల్లింది.

ఐసీసీ తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయంపై నమీబియా, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్ జట్ల కెప్టెన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ఐసీసీ డొల్లతనాన్ని ఎండగడుతూ.. “ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆటను విస్తరిస్తామని, చిన్న దేశాలను ప్రోత్సహిస్తామని ఐసీసీ పెద్ద పెద్ద మాటలు చెబుతుంది. కానీ ఆచరణలో మాత్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుని అసోసియేట్ దేశాలు ప్రపంచంలోని బెస్ట్ టీమ్స్‌తో తలపడే అవకాశాలను దూరం చేస్తోంది” అని మండిపడ్డారు. మరోవైపు ప్రపంచకప్ ఆతిథ్య దేశాలలో ఒకటైన నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ మాట్లాడుతూ.. “ప్రపంచకప్‌లో ఆడాలంటే అర్హత సాధించాలనే నిబంధనను మేము గౌరవిస్తాం, కానీ ఆ క్వాలిఫికేషన్ ప్రక్రియ చిన్న జట్లకు ప్రపంచ వేదికపై ఆడేందుకు నిజమైన అవకాశం ఇచ్చేలా ఉండాలి కానీ ఇలా అన్యాయంగా ఉండకూడదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే విషయమై స్కాట్లాండ్ కెప్టెన్ రిచీ బెరింగ్టన్ మాట్లాడుతూ.. ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు క్రీడాకారుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆటగాళ్ల కెరీర్‌ను ప్రభావితం చేసే విషయాల్లో మేనేజ్‌మెంట్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇక ఐసీసీ పూర్తి స్థాయి సభ్య దేశమైనప్పటికీ ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ సైతం తీవ్రంగా స్పందించారు. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను ఉదాహరణగా చూపిస్తూ.. “ప్రస్తుతం చిన్న, అసోసియేట్ జట్లు గ్లోబల్ టోర్నమెంట్లలో అద్భుత ప్రదర్శనలు చేస్తూ క్రికెట్ క్రేజ్ పెంచుతున్నాయి. ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో చిన్న జట్లకు ఎలాగైతే విస్తృత అవకాశాలు ఇస్తారో, క్రికెట్‌లో కూడా అలాంటి ప్రగతిశీల ఆలోచనలు చేయాలి తప్ప జట్లను తగ్గించకూడదు” అని హితవు పలికారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us