WTC Final 2021: తొలి సెషన్ ఆట రద్దు.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం అడ్డంకి! మిగతా రోజుల ఆటపైనా అనుమానం?

|

Jun 18, 2021 | 3:19 PM

క్రికెట్ ప్రపంచం అంతా ఎదురుచూస్తోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ పై వరుణుడు కన్నెర చేశాడు. అంతా అనుకున్నట్లుగానే మ్యాచ్‌కు ముందు వర్షంతో అంతరాయం ఏర్పడింది.

WTC Final 2021: తొలి సెషన్ ఆట రద్దు.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం అడ్డంకి! మిగతా రోజుల ఆటపైనా అనుమానం?
Bcci Update On Wtc Final
Follow us on

WTC Final 2021: క్రికెట్ ప్రపంచం అంతా ఎదురుచూస్తోన్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పై వరుణుడు కన్నెర చేశాడు. అంతా అనుకున్నట్లుగానే మ్యాచ్‌కు ముందు వర్షంతో అంతరాయం ఏర్పడింది. సౌథాంప్టన్‌లో ఈ రోజు ఉదయం నుంచి ఓ రేంజ్‌లో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో పిచ్‌తోపాటు మైదానంలో కొంత భాగాన్ని కవర్లతో కవర్ చేసి ఉంచారు. శుక్రవారం మ్యాచ్‌ మొదలవ్వడానికి గంట ముందు అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. వర్షం గ్యాప్‌ లేకుండా కురుస్తూనే ఉంది. టాస్‌ ప్రారంభానికి ముందు బీసీసీఐ సౌథాంప్టన్ వాతావరణ పరిస్థితులను అప్‌డేట్‌ చేసింది. ఈమేరకు ట్విట్టర్లో తొలి సెషన్ ఆట రద్దైందని ప్రకటించింది. “దురదృష్టవశాత్తు తొలిరోజు తొలి సెషన్‌ ఆట ఉండదు” అని బ్యాడ్ న్యూస్ అందించింది. దీంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ టైంలో అక్కడ మ్యాచ్‌ ఎలా షెడ్యూల్ చేశారని, రానున్న ఐదు రోజులు కూడా అక్కడ వర్షం పడనుందని కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు ఇరు జట్ల ఆటగాళ్లు వర్షం ఎప్పుడు ఆగిపోతుందోనని ఎదురుచూస్తున్నారు. అయితే వాతావరణ నివేదికల మేరకు రానున్న ఐదురోజులు కూడా మ్యాచ్ జరిగే అవకాశం ఉండదని తెలుస్తోంది. సౌథాంప్టన్‌లో ఈనెల 18 నుంచి 22 వరకు భారీగానే వర్షాలు కురవనున్నట్లు వెదర్ అప్‌డేట్ ఉంది. రోజుల వారీగా వాతావరణాన్ని పరిశీలిస్తే.. శుక్రవారం రోజు 98 శాతం వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే శనివారం రోజు 100 శాతం, ఆదివారం 93 శాతం, సోమవారం 77 శాతం, మంగళవారం రోజు 77 శాతం వర్షం పడుతుందని వాతావారణ శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరిగే అవకాశం లేదని పేర్కొంది. అలాగే ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే (23) ప్రకటించింది ఐసీసీ. ఈ ఒక్కరోజులో మ్యాచ్ ఫలితం తేలడం సాధ్యం కాదు. మొత్తానికి శుక్రవారం తొలి సెషన్ రద్దు కావడంతో.. మిగతా రోజులు కూడా ఇలా ఉంటే కష్టమంటూ అభిమానులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్ ఆటగాళ్లు వర్షంలో వేడివేడి గా కాఫీ తాగుతూ గడుపుతున్నారు. ఈమేరకు ట్విట్టర్లో ఓ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫైనల్ లో విజేత ఎవరనేది తేలకపోతే సంయుక్త విజేతలుగా భారత్, న్యూజిలాండ్‌ లను ఐసీసీ ప్రకటించనుంది. ప్రైజ్‌ మనీనీ కూడా సంయుక్తంగా పంచుకుంటారని ఐసీసీ పేర్కొంది.

భారత్ ప్లేయింగ్ లెవన్:

రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్, చేతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ.

Also Read: