
Most Fours in Cricket : క్రికెట్ చరిత్రలో ఎందరో దిగ్గజ బ్యాటర్లను చూశాం. సచిన్ టెండూల్కర్ నుంచి వివ్ రిచర్డ్స్, విరాట్ కోహ్లీ వరకు ఎంతో మంది ఆటగాళ్లు తమ కెరీర్లో అద్భుతమైన రికార్డులను సృష్టించారు. ప్రస్తుతం టీ20 క్రికెట్ హవా నడుస్తుండటంతో నేటి తరం యువ బ్యాటర్లు ఫోర్లు కొట్టడం కంటే సిక్సర్లు బాదడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అయితే, ఒక బ్యాటర్ మంచి టైమింగ్తో క్లాసిక్ ఫోర్ కొట్టినప్పుడు వచ్చే ఆత్మసంతృప్తి, కిక్కే వేరని క్రికెట్ లవర్స్ చెబుతుంటారు. మరి టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఇలా అన్ని ఫార్మాట్లలో కలిపి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్లెవరో తెలుసుకుందాం.
4000 ఫోర్లతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానం
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. తన సుదీర్ఘ అద్భుత కెరీర్లో సచిన్ ఏకంగా 4076 ఫోర్లు బాదాడు. ఈ ఎలైట్ లిస్ట్లో సచిన్ దరిదాపుల్లో కూడా ఏ ఒక్క బ్యాటర్ లేకపోవడం విశేషం. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర 3015 ఫోర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. క్రికెట్ ప్రపంచంలో సచిన్, సంగక్కర మినహా మరే ఇతర బ్యాటర్ కూడా ఇప్పటివరకు 3 వేల ఫోర్ల మైలురాయిని దాటలేకపోయారు.
కింగ్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు
ఈ చారిత్రాత్మక జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (2781 ఫోర్లు) మూడో స్థానంలో ఉండగా, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 2772 ఫోర్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఇక్కడ విరాట్ కోహ్లీ పేరిట ఒక అరుదైన రికార్డు ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో 2000 కంటే ఎక్కువ ఫోర్లు కొట్టిన బ్యాటర్లందరిలో కెల్లా.. 50కి పైగా బ్యాటింగ్ సగటు ఉన్న ఏకైక ఏకైక బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రమే కావడం విశేషం. రికీ పాంటింగ్ రికార్డును అధిగమించడానికి కోహ్లీ ఇంకా కొన్ని ఫోర్ల దూరంలోనే ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ఫోర్లు కొట్టిన టాప్-7 బ్యాటర్లు:
సచిన్ టెండూల్కర్ (భారత్): 4076 ఫోర్లు
కుమార సంగక్కర (శ్రీలంక): 3015 ఫోర్లు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా): 2781 ఫోర్లు
విరాట్ కోహ్లీ (భారత్): 2772 ఫోర్లు
మహేల జయవర్ధనే (శ్రీలంక): 2679 ఫోర్లు
రాహుల్ ద్రవిడ్ (భారత్): 2604 ఫోర్లు
బ్రియాన్ లారా (వెస్టిండీస్): 2601 ఫోర్లు
2000 ఫోర్ల క్లబ్లో ఐదుగురు భారత వీరులు
క్రికెట్ చరిత్ర పుటలను గమనిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో 2000 లేదా అంతకంటే ఎక్కువ ఫోర్లు కొట్టిన ఘనత కేవలం ఐదుగురు భారతీయ బ్యాటర్లకు మాత్రమే దక్కింది. టీమిండియాకు చెందిన ఈ ఐదుగురు లెజెండరీ ఆటగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పిచ్లపై ఫోర్ల వర్షం కురిపించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (4076) మొదటి స్థానంలో ఉండగా, కింగ్ విరాట్ కోహ్లీ (2772) రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ది వాల్ రాహుల్ ద్రవిడ్ 2604 ఫోర్లతో, ముల్తాన్ సుల్తాన్ వీరేంద్ర సెహ్వాగ్ 2408 ఫోర్లతో, కోల్కతా దాదా సౌరవ్ గంగూలీ 2022 ఫోర్లతో ఈ ప్రత్యేకమైన మైలురాయిని అందుకున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి