IND Vs SL: గిల్ తప్పిదాలే మ్యాచ్ డ్రాకు కారణమా?.. టెస్ట్ డ్రాపై విరుచుకుపడ్డ మాజీ క్రికెటర్

IND Vs SL: టెస్టు ఐదో రోజు పిచ్ స్పిన్నర్లకు ఎంతో అనుకూలించినప్పటికీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరైన వ్యూహాలు అమలు చేయలేకపోయాడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. గిల్ ఇంకా కెప్టెన్‌గా ఫినిష్డ్ ప్రొడక్ట్ కాదని, అనుభవంతో మాత్రమే అతడి నాయకత్వ పటిమ పెరుగుతుందని వ్యాఖ్యానించాడు.

IND Vs SL: గిల్ తప్పిదాలే మ్యాచ్ డ్రాకు కారణమా?.. టెస్ట్ డ్రాపై విరుచుకుపడ్డ మాజీ క్రికెటర్
Shubman Gill (2)

Updated on: Aug 28, 2026 | 11:04 AM

IND Vs SL: శ్రీలంకతో కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ డ్రాగా ముగియడంపై టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందించాడు. టెస్టు ఐదో రోజు పిచ్ స్పిన్నర్లకు ఎంతో అనుకూలించినప్పటికీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరైన వ్యూహాలు అమలు చేయలేకపోయాడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. గిల్ ఇంకా కెప్టెన్‌గా ఫినిష్డ్ ప్రొడక్ట్ కాదని, అనుభవంతో మాత్రమే అతడి నాయకత్వ పటిమ పెరుగుతుందని వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌లో బౌలర్లకు కేవలం ఒక్క ఓవర్ స్పెల్ మాత్రమే ఇచ్చి మార్చేయడం లాంటి నిర్ణయాలు బౌలర్ల లయను, ప్రత్యర్థిపై ఒత్తిడిని దెబ్బతీశాయని విమర్శించాడు.

ఐదో రోజు పిచ్‌పై మంచి టర్న్ లభిస్తున్న తరుణంలో భారత జట్టు మరింత ఆక్రమణత్మకంగా ఫీల్డ్ సెట్ చేసి ఉండాల్సిందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు కేవలం 3 వికెట్లు మాత్రమే తీయగలగడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిందని అన్నాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని కైఫ్ గుర్తు చేసుకున్నాడు. మైదానంలో వికెట్లు పడని సమయంలో విరాట్ కోహ్లీ చూపే అగ్రెషన్, ఎనర్జీ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని, కొలంబో టెస్టు చివరి రోజు భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్‌లో ఆ కసి కనిపించలేదని పేర్కొన్నాడు.

శ్రీలంక యంగ్ బ్యాటర్ సోనాల్ దినుషా రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలతో చెలరేగడంపై కైఫ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. గాల్ టెస్టులో కూడా సెంచరీ చేసిన దినుషాపై భారత బౌలర్లు ఎలాంటి ప్రత్యేక వ్యూహం లేకుండా బరిలోకి దిగినట్లు అనిపించిందని అన్నాడు. అతడికి ఫుల్ లెంగ్త్ బంతులు వేయకుండా నిరంతరం షార్ట్ బాల్స్ వేసి పరుగులు సమర్పించుకున్నారని, పక్కా ప్లానింగ్, రీసెర్చ్ లేకపోవడం వల్లే దినుషాను ఔట్ చేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే శ్రీలంకకు ఫాలోఆన్ ఇవ్వాలనే గిల్ నిర్ణయాన్ని మాత్రం కైఫ్ సమర్థించాడు.

ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ ఈ సిరీస్ నుంచి భారత్‌కు దక్కిన అతిపెద్ద పాజిటివ్ అంశం ధ్రువ్ జురెల్ సెంచరీ అని కైఫ్ కొనియాడాడు. గాల్ టెస్టులో లభించిన శుభారంభాన్ని పెద్ద ఇన్నింగ్స్‌గా మలచలేకపోయిన జురెల్, కొలంబోలో ఒత్తిడిని జయించి అద్భుతమైన సెంచరీ సాధించాడని మెచ్చుకున్నాడు. జురెల్ సాంకేతికంగా ఎంతో పరిణతి చెందిన బ్యాటర్ అని, ఒత్తిడిలో ఎలా ఆడాలో నిరూపించుకున్నాడని కైఫ్ ప్రశంసించాడు. ఏది ఏమైనా ఈ డ్రా మ్యాచ్ నుంచి గిల్ కెప్టెన్సీ, బౌలింగ్ ప్లానింగ్ విషయంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us