Team India: ‘టీమిండియాకి అంత సీన్ లేదు.. గ్రూప్ 1 నుంచి సెమీస్ చేరేది ఆ రెండు జట్లే..’

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ సెమీఫైనల్స్ అంచనాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌కు భారత్ అర్హత సాధించదని.. సూపర్ 8 రౌండ్‌లో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వేలతో కూడిన "గ్రూప్ ఆఫ్ డెత్" చాలా కఠినంగా ఉంటుందన్నాడు.

Team India: టీమిండియాకి అంత సీన్ లేదు.. గ్రూప్ 1 నుంచి సెమీస్ చేరేది ఆ రెండు జట్లే..
Team India T20i World Cup 2026

Updated on: Feb 21, 2026 | 12:20 PM

టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకోదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు సూపర్ 8 రౌండ్‌లోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుందని జోస్యం చెప్పాడు. వార్తల్లో నిలిచేందుకు తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అమీర్.. తన ఈ అంచనాకు బలమైన కారణాలను కూడా ప్రస్తావించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 రౌండ్ ఫిబ్రవరి 21న ప్రారంభమవుతుంది. ఈ దశలో ఎనిమిది జట్లు సెమీఫైనల్ బెర్తుల కోసం తీవ్రంగా పోటీపడతాయి. సూపర్ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో భారత్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఉన్నాయి. ఈ గ్రూప్‌ను “గ్రూప్ ఆఫ్ డెత్”గా చెబుతున్నారు. గ్రూప్ 2లో శ్రీలంక, పాకిస్థాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఉన్నాయి. ప్రతి గ్రూప్‌లోని ఒక జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.

మహ్మద్ అమీర్ తన అంచనా ప్రకారం.. టోర్నమెంట్‌లో అతిపెద్ద ఫేవరెట్లలో ఒకటిగా భారత్ ఉన్నప్పటికీ.. సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమిస్తుందని పేర్కొన్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ మినహా భారత జట్టు బ్యాటింగ్ లైనప్ మిగిలిన అన్ని మ్యాచ్‌లలోనూ విఫలమైందని అన్నాడు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ప్రస్తుతం ఆడుతున్న తీరు చూస్తుంటే ఏ జట్టునైనా ఓడించగలవని అమీర్ అభిప్రాయపడ్డాడు. సూపర్ 8 రౌండ్‌లోని గ్రూప్ 1లోని నాలుగు జట్లు మునుపటి రౌండ్‌లో అపజయం ఎరుగనివి. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ నాలుగు మ్యాచ్‌లలో నాలుగూ గెలిచి వచ్చాయి. జింబాబ్వే మూడు మ్యాచ్‌లలో గెలిచి, ఐర్లాండ్‌తో జరిగిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో అజేయంగా నిలిచింది. ఇది గ్రూప్ 1ను చాలా కఠినమైనదిగా మారుస్తోంది. టీమిండియా సూపర్ 8 షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేతో తలపడుతుంది. చివరి సూపర్ 8 మ్యాచ్ మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతుంది. టీమ్ ఇండియా నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ మూడు మ్యాచ్‌లలో కనీసం రెండు గెలవాలి. ఇది సులభం కాదని అమీర్ అంచనా.

Follow Us