
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ టీమిండియా విధ్వంసకర బ్యాటర్లను ఎదుర్కోవడం బౌలర్లకు చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. భారత జట్టుతో మ్యాచ్లు జరిగినప్పుడు బౌండరీ లైన్లను వెనక్కి జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 46 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ ఓటమి అనంతరం మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ, సిరీస్ కోల్పోయినప్పటికీ అనేక సానుకూల అంశాలు ఉన్నాయని తెలిపారు. భారత్ బలమైన జట్టు అని, ముఖ్యంగా సొంతగడ్డపై వారిని ఓడించడం చాలా కష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ సిరీస్ బౌలర్లు, బ్యాటర్లకు సవాళ్లను విసిరిందని, తద్వారా నేర్చుకోవడానికి అవకాశం లభించిందని శాంట్నర్ వెల్లడించారు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడే బ్యాటర్లను ఎదుర్కోవడానికి బౌలింగ్ యూనిట్లు కొత్త మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించారు. ఈ మ్యాచ్లో టీమిండియా 271 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 225 పరుగులకే పరిమితమైంది.
ప్రపంచకప్ ముంగిట ఏం నేర్చుకుంటున్నామనేది చెప్పడం కష్టమన్నారు. ముఖ్యంగా ఫ్లాట్ పిచ్లపై 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలమని తెలిసినప్పుడు భారీ ఓవర్లను 15-16 పరుగులకే పరిమితం చేయడం నేర్చుకోవాలని మిచెల్ శాంట్నర్ సూచించారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 271 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇషాన్ కిషన్ సెంచరీతో చెలరేగగా, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బౌండరీల వర్షం కురిసిన ఈ మ్యాచ్లో భారత్ 23 సిక్సర్లతో పాటు 17 ఫోర్లు బాదగా, న్యూజిలాండ్ 13 సిక్సర్లు, 19 ఫోర్లు కొట్టింది.
ఇది చదవండి: కోహ్లీ బౌలర్ అయ్యింటే ఇతడిలా ఉండేవాడేమో.! ఈ యాంగ్రీ ప్లేయర్ ఎవరంటే.?
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి