
18 Ball Over : వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్లోని 14వ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఒక వింత సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లీసెస్టర్లోని గ్రేస్ రోడ్ మైదానంలో పాకిస్తాన్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఛాంపియన్స్ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. అయితే, మ్యాచ్ ఫలితం కంటే కూడా ఆస్ట్రేలియా ఛాంపియన్స్ పేసర్ జాన్ హేస్టింగ్స్ వేసిన 18 బంతుల ఓవర్ గురించే పెద్ద చర్చ నడుస్తోంది. ఎందుకంటే, ఆ ఓవర్ పూర్తి కాకముందే మ్యాచ్ ముగిసిపోయింది.
ఆస్ట్రేలియా ఛాంపియన్స్ తరఫున 8వ ఓవర్ వేయడానికి వచ్చిన జాన్ హేస్టింగ్స్, తన బౌలింగ్తో క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ ఓవర్లో అతను ఏకంగా 12 వైడ్లు, ఒక నో బాల్ వేశాడు. అంటే, 13 ఎక్స్ ట్రా బాల్స్. మొత్తంగా అతను 18 బంతులు వేశాడు.. కానీ అందులో కేవలం 5 బంతులు మాత్రమే వేశాడు. ఆ ఓవర్ పూర్తి కాకముందే పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు సులువుగా లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. హేస్టింగ్స్ ఈ ఓవర్లో 20 పరుగులు సమర్పించుకోవడమే కాకుండా, మ్యాచ్ కూడా ముగిసిపోయింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ఛాంపియన్స్ కెప్టెన్ షోయబ్ మాలిక్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అతని నిర్ణయం సరైనదే అని నిరూపితమైంది. ఆస్ట్రేలియా ఛాంపియన్స్ జట్టు కేవలం 74 పరుగులకే కుప్పకూలింది. మొత్తం జట్టు 11.5 ఓవర్లలోనే పెవిలియన్ చేరింది. పాకిస్తాన్ మాజీ స్పిన్ దిగ్గజం సయీద్ అజ్మల్ తన అద్భుతమైన బౌలింగ్తో 6 వికెట్లు పడగొట్టగా, ఇమాద్ వసీం 2 వికెట్లు తీసుకున్నాడు. కంగారూ ఛాంపియన్స్ జట్టు తరఫున బెన్ డంక్ అత్యధికంగా 26 పరుగులు చేశాడు.
75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పాకిస్తాన్ ఛాంపియన్స్ ఓపెనర్లు ఎలాంటి తప్పు చేయలేదు. జట్టు 7.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించి ఘన విజయం సాధించింది. షర్జీల్ ఖాన్ 23 బంతుల్లో 32 పరుగులు, షోయబ్ మక్సూద్ 26 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టుకు ఏకపక్ష విజయాన్ని అందించారు. అద్భుత ప్రదర్శన చేసిన సయీద్ అజ్మల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ పాకిస్తాన్ అద్భుతమైన విజయానికి గుర్తుండిపోవడమే కాకుండా, జాన్ హేస్టింగ్స్ వేసిన 18 బంతుల ఓవర్ క్రికెట్ చరిత్రలోని అత్యంత వింత క్షణాలలో ఒకటిగా నిలిచిపోయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..