
India Captain : సౌతాఫ్రికాతో జరగబోయే కీలకమైన వైట్-బాల్ సిరీస్కు ముందు టీమిండియాకు కెప్టెన్సీ సమస్య ఎదురైంది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ గాయం కారణంగా ఇప్పటికే తొలి టెస్ట్ నుంచి తప్పుకోగా, రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదు. దీంతో రాబోయే మూడు వన్డేల సిరీస్కు కెప్టెన్గా ఎవర్ని సెలక్ట్ చేయాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. గాయం కారణంగా గిల్ దూరమైన నేపథ్యంలో, వైస్-కెప్టెన్ కూడా అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్సీ రేసులో ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ముందున్నారు.
భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కోల్కతాలో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో స్వీప్ షాట్ ఆడుతున్నప్పుడు గిల్ మెడలో నొప్పి రావడంతో కేవలం మూడు బంతులు మాత్రమే ఆడి మైదానాన్ని వీడాడు. బీసీసీఐ ప్రకారం, గిల్కు మెడ పట్టేయడం జరిగింది. దీంతో తొలి టెస్టుకు పూర్తిగా నవంబర్ 22న గౌహతిలో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు కూడా గిల్ దూరమయ్యే అవకాశం ఉంది.
గిల్ ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలో యువ ఆల్-రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నారు. రెండో టెస్టు ఇంకా ప్రారంభం కాకముందే, నవంబర్ 30న రాంచీలో మొదలు కానున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్పై దృష్టి మళ్లింది. సిరీస్ కోసం జట్టును త్వరలోనే ప్రకటించనున్నారు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వన్డే సిరీస్కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. అలాగే వైస్-కెప్టెన్గా ఉన్న శ్రేయాస్ అయ్యర్ కూడా గాయం కారణంగా దూరంగా ఉండటంతో కెప్టెన్సీపై క్లారిటీ లేదు.
దీనితో టెస్ట్ వైస్-కెప్టెన్ రిషభ్ పంత్, సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ రేసులో ప్రధాన పోటీదారులుగా నిలిచారు. జట్టులో రాహుల్కు ఉన్న అనుభవం, సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఎక్కువగా ఉంది. నిరంతరం అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నందున గిల్కు ఈ సిరీస్లో విశ్రాంతినిచ్చి టీ20 సిరీస్కు సిద్ధం చేసే అవకాశం కూడా ఉంది. సౌతాఫ్రికాతో జరగబోయే ఈ వన్డే సిరీస్తో ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రానున్నారు.
ఈ సిరీస్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చాలా కీలకం. ఆస్ట్రేలియా పర్యటనలో తమ ఫామ్ నిరూపించుకున్నప్పటికీ వారు స్థిరంగా రాణించాల్సిన అవసరం ఉంది. వరల్డ్ కప్ 2027 కోసం పోటీలో ఉండాలంటే, సౌతాఫ్రికాపై ఆ తర్వాత వచ్చే మ్యాచ్లలో వారి మంచి ప్రదర్శన చాలా ముఖ్యమైనది. మిగిలిన వన్డే మ్యాచ్లు డిసెంబర్ 3న రాయ్పూర్, డిసెంబర్ 6న విశాఖపట్నంలో జరగనున్నాయి. వన్డేల తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ కూడా ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..