
ఒక స్థాయి వచ్చాక చాలా మంది తాము ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతారు. డబ్బు, హోదా, ఆస్తి, అంతస్థు రాగానే.. తమ గ్రౌండ్ రూట్స్ మర్చిపోతారు. కొంతమంది అయితే ప్రాణస్నేహితులను కూడా మర్చిపోతారు. తమ లెవెల్కు తగ్గ వారితో ఉండాలని ఉబలాటపడతారు. కానీ, ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత రిచ్ క్రికెట్ లీగ్లో అదరగొట్టిన తర్వాత కూడా ఓ యువ క్రికెటర్ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. స్థాయి ముఖ్యం కాదు.. స్నేహమే ముఖ్యంగా అంటూ ఓ సాధారణ విందుకు హాజరయ్యాడు. విందుకు వచ్చిన వారితో తాను ఒకడిలా కలిసిపోయి వారితో కలిసిపోయి స్పెషల్గా కాకుండా సింపుల్గా విందు ఆరగించాడు. ఆ క్రికెటర్ మరెవరో కాదు.. మన హోమ్ టీమ్ సన్రైజర్స్ తరఫున ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో అదరగొట్టిన పేసర్ సాకిబ్ హుస్సేన్. పేద కుటుంబం నుంచి వచ్చి, ఐపీఎల్ స్టార్గా ఎదిగిన హుస్సేన్ తన రూట్స్ మర్చిపోలేదు. తన పాత స్నేహాన్ని విడిచిపెట్టలేదు. ఈ ఒక్క సంఘటనతో హుస్సేన్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
2004 డిసెంబర్ 14న జన్మించిన సాకిబ్ హుస్సేన్ చిన్నప్పటి నుంచే టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతూ తన వేగంతో గుర్తింపు పొందాడు. అతని తండ్రి అలీ అహ్మద్ హుస్సేన్ స్థానికంగా కూలీగా పనిచేసేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో క్రికెట్ సామగ్రి కొనుగోలు చేయడం కూడా వారికి కష్టంగా ఉండేది. ఒక దశలో బౌలింగ్ స్పైక్స్ కొనుగోలు చేయడానికి అతని తల్లి తన నగలను కూడా అమ్మారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కుటుంబ సభ్యులు అతని కలను వదులుకోకుండా ప్రోత్సహించారు.
పట్నాలోని జెన్నెక్స్ట్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందిన సాకిబ్, బీహార్ తరఫున 2022-23 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీ20 అరంగేట్రం చేశాడు. తన రెండో మ్యాచ్లోనే 4 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అనంతరం దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శన కనబర్చాడు. 2025-26 రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్పై 6/41తో తొలి ఐదు వికెట్ల ఘనత సాధించి తన ప్రతిభను మరోసారి నిరూపించాడు. అతని ప్రతిభను గుర్తించిన కోల్కతా నైట్రైడర్స్ 2024లో జట్టులోకి తీసుకున్నప్పటికీ ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. అనంతరం 2026 ఐపీఎల్ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ రూ.30 లక్షలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ అవకాశాన్ని సాకిబ్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సాకిబ్ హుస్సేన్ 4 వికెట్లతో సంచలన ప్రదర్శన చేశాడు. కేవలం 24 పరుగులకే నాలుగు వికెట్లు తీసి సన్రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే మ్యాచ్లో మరో అరంగేట్ర పేసర్ ప్రఫుల్ హింగేతో కలిసి ప్రత్యర్థి బ్యాటింగ్ను కుప్పకూల్చాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్లో అరంగేట్ర మ్యాచ్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్ల సరసన చేరాడు. 2026 సీజన్లో సాకిబ్ మొత్తం 11 మ్యాచ్లు ఆడాడు. సీజన్లో 15 వికెట్లు సాధించి సన్రైజర్స్ బౌలింగ్ విభాగానికి కీలక బలంగా నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టడం అతని కెరీర్లో మరో గుర్తుండిపోయే ఘట్టంగా మారింది. పేదరికాన్ని జయించి దేశంలోని అతిపెద్ద టీ20 లీగ్లో తన ప్రతిభను చాటుకున్న సాకిబ్ హుస్సేన్, కష్టపడితే అవకాశాలు తప్పకుండా వస్తాయని మరోసారి నిరూపించాడు. యువ వేగబౌలర్గా అతని ఎదుగుదలను భారత క్రికెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి