
ప్రస్తుత సీజన్లో టాప్-4 స్థానాల కోసం ఏడు జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ ప్రతి మ్యాచ్ సెమీఫైనల్ను తలపిస్తోంది. అయితే, అభిమానులను నిరాశపరుస్తూ మూడు ప్రధాన జట్లు ఈ పోటీ నుంచి పూర్తిగా తప్పుకున్నాయి. మిగిలిన మ్యాచ్లలో ఈ జట్లు కేవలం తమ ఆత్మగౌరవం కోసం, పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం కోసం మాత్రమే తలపడనున్నాయి.
అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఘోరంగా విఫలమైంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్లలో కేవలం నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేసి, ఏడు మ్యాచ్లలో ఓటమి పాలైంది. గత ఐదు మ్యాచ్లలో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించడం ఆ జట్టు పతనానికి ప్రధాన కారణమైంది. మిగిలిన మూడు మ్యాచ్లలో గెలిచినా ఆ జట్టు గరిష్టంగా 14 పాయింట్లకు మాత్రమే చేరుకుంటుంది. ఇది ప్లే ఆఫ్ చేరడానికి ఏమాత్రం సరిపోదు.
ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ ఏడాది కూడా అభిమానులను మెప్పించలేకపోయింది. 10 మ్యాచ్లలో కేవలం 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. గణితశాస్త్ర లెక్కల ప్రకారం ముంబైకి ఇంకా స్వల్ప అవకాశం ఉన్నట్లు అనిపించినా, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడటం, వారి రన్ రేట్ తక్కువగా ఉండటం వల్ల ప్లే ఆఫ్ చేరడం అసాధ్యంగా కనిపిస్తోంది. ముంబై జట్టుకు ఇది వరుసగా మరో నిరాశాజనక సీజన్గా మిగిలిపోనుంది.
లక్నో సూపర్ జెయింట్స్ కథ కూడా ముగిసిపోయింది. రిషబ్ పంత్ నాయకత్వంలో ఆడుతున్న ఈ జట్టు 10 మ్యాచ్లలో కేవలం 3 విజయాలను మాత్రమే ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండో ఏడాది కూడా లక్నో ప్లే ఆఫ్ చేరడంలో విఫలమవ్వడం గమనార్హం. జట్టులోని కీలక ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం, నిలకడలేని ప్రదర్శన జట్టు కొంపముంచింది. అయితే, గత మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించి, టోర్నీని గౌరవప్రదంగా ముగించేందుకు లక్నో ప్రయత్నిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..