
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన లీగ్ దశను ముగించుకుని అసలైన అసైన్మెంట్కు సిద్ధమైంది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ప్లేఆఫ్స్ పోరుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు అర్హత సాధించాయి. అయితే ఈసారి ఏ జట్టు కప్పు కొట్టినా ఒక అరుదైన రికార్డు నమోదు కానుంది.
గత రెండు నెలలుగా సాగిన హోరాహోరీ పోరాటాలకు తెరపడింది. ఇప్పటివరకు ఏ జట్టు ఎన్ని విజయాలు సాధించింది, పాయింట్ల పట్టికలో ఏ స్థానంలో నిలిచింది అనే విషయాలకు ఇక ప్రాధాన్యం లేదు. మంగళవారం నుంచి మొదలయ్యే నాకౌట్ సమరంలో ఆ రోజు ఆటలో ఎవరు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారనేదే ముఖ్యం. ముఖ్యంగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రతి మ్యాచ్ జీవన్మరణ సమస్యే. ఒక్క తప్పు దొర్లినా టైటిల్ కల చెదిరి ఇంటిముఖం పట్టాల్సిందే. మరోవైపు మొదటి రెండు స్థానాల్లో ఉన్న బెంగళూరు, గుజరాత్ జట్లు నెట్ రన్రేట్ పరంగా బలంగా కనిపిస్తున్నా, ప్లేఆఫ్స్లో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయలేం.
ఈ సీజన్ ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన జట్లను గమనిస్తే ఒక ఆసక్తికరమైన నిజం గమనంలోకి వస్తుంది. ఈ నాలుగు జట్లలో ఈ ఏడాది ఎవరు విజేతగా నిలిచినా, అది ఆ జట్టుకు రెండో ఐపీఎల్ టైటిల్ కానుంది. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ఈ తరహా సమీకరణం రావడం నిజంగా విశేషం. దీంతో ఈసారి సరికొత్త ఛాంపియన్కు అవకాశం లేదు కానీ, రెండోసారి సింహాసనాన్ని అధిష్టించే జట్టు ఏదో తేలిపోనుంది.
గతేడాది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త చరిత్ర సృష్టించింది. సుదీర్ఘమైన 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ప్రస్తుత సీజన్లోనూ డిఫెండింగ్ ఛాంపియన్గా అడుగుపెట్టిన బెంగళూరు అదే జోరును కొనసాగిస్తోంది. ఈసారి కూడా విజేతగా నిలిస్తే వరుసగా రెండో ఏడాది కప్పు గెలవడంతో పాటు, తన ఖాతాలో రెండో టైటిల్ను వేసుకుంటుంది. మరోవైపు 2022లో లీగ్లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది కూడా కప్పు కొడితే గుజరాత్కు కూడా ఇది రెండో టైటిల్ అవుతుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు డేవిడ్ వార్నర్ సారథ్యంలో అప్పుడెప్పుడో 2016లో తన మొదటి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. ఆ తర్వాత పలుమార్లు ప్లేఆఫ్స్కు చేరినా ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా రెండో కప్పు సాధించాలని పట్టుదలగా ఉంది. ఇక లీగ్ ప్రారంభ సీజన్ అయిన 2008లో దివంగత షేన్ వార్న్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ అద్భుతం చేసింది. తొలి ఐపీఎల్ విజేతగా నిలిచిన రాజస్థాన్, ఆ తర్వాత ఇప్పటివరకు రెండోసారి కప్పును ముద్దాడలేదు. సుమారు 18 ఏళ్లుగా కప్పు కోసం ఎదురుచూస్తున్న ఆ జట్టుకు ఈసారి సువర్ణావకాశం దక్కింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..