
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఒక విచిత్రమైన, అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కోల్కతా నైట్ రైడర్స్తో (KKR) జరిగిన సీజన్ 65వ లీగ్ మ్యాచ్లో ముంబై జట్టు సరికొత్త కెప్టెన్తో బరిలోకి దిగింది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మళ్లీ జట్టులోకి రావడంతో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. దీంతో ముంబై ఇండియన్స్ వరుసగా ఆడిన మూడు మ్యాచ్ల్లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను మార్చినట్లయింది. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ఇలా జరగడం ఇది కేవలం రెండోసారి మాత్రమే కావడం విశేషం.
సూర్య, బుమ్రా.. ఆపై హార్దిక్! అసలు ఏమైందంటే?
ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఆటగాళ్ల గాయాలు, ఇతర కారణాలతో తుది జట్టును (Playing XI) మాటిమాటికీ మార్చాల్సి వచ్చింది.
మే 10 (ఆర్సీబీ మ్యాచ్): రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు వెన్నునొప్పి రావడంతో రాయ్పూర్లో జరిగిన మ్యాచ్కు దూరమయ్యాడు. ఆ సమయంలో వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించాడు.
మే 14 (పంజాబ్ కింగ్స్ మ్యాచ్): ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ సమయానికి సూర్యకుమార్ యాదవ్ ఇంట్లో బాబు పుట్టడంతో ఆయన కూడా సెలవు తీసుకున్నాడు. దీంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా బాధ్యతలు అందుకోవాల్సి వచ్చింది.
మే 20 (కేకేఆర్ మ్యాచ్): ఇప్పుడు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ ఇద్దరూ తుది జట్టులోకి వచ్చారు. దీంతో హార్దిక్ మళ్లీ టాస్ వేసి కెప్టెన్సీని స్వీకరించాడు.
13 ఏళ్ల తర్వాత పునరావృతమైన వింత రికార్డ్
ఒకే సీజన్ లో వరుసగా మూడు మ్యాచ్ల్లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో బరిలోకి దిగిన రికార్డు ఇప్పటివరకు కేవలం ఒక్క జట్టు పేరిట మాత్రమే ఉండేది. గతంలో 2013 ఐపీఎల్ సీజన్ లో పుణే వారియర్స్ ఇండియా(PWI) జట్టు ఇలాంటి ప్రయోగం చేసింది. ఆ సీజన్ లో పుణే జట్టుకు వరుసగా జరిగిన మ్యాచ్ల్లో రాస్ టేలర్, ఏంజెలో మాథ్యూస్ మరియు ఆరోన్ ఫించ్ కెప్టెన్లుగా వ్యవహరించారు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత ఆ వింత సీన్ ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ రూపంలో రిపీట్ అయింది.
ప్లేఆఫ్స్ రేస్ నుంచి అవుట్
ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ 2026 సీజన్ ఏమాత్రం కలిసిరాలేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన 12 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించిన ముంబై.. ప్లేఆఫ్స్ రేస్ నుంచి అధికారికంగా ఇప్పటికే వెనుతిరిగింది. మరోవైపు అజింక్యా రహానే కెప్టెన్సీలోని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం. టోర్నీ నుంచి నిష్క్రమించినా.. మిగిలిన మ్యాచ్ల్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ముంబై చూస్తోంది.