IPL 2026 Honey Trap : ఐపీఎల్ 2026లో హనీ ట్రాప్ కలకలం.. అసలు కిలాడీ ఎవరో కనిపెట్టిన బీసీసీఐ

IPL 2026 Honey Trap : ఐపీఎల్ 2026 లో కలకలం రేపిన హనీ ట్రాప్ స్కాండల్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బీసీసీఐ కనుగొంది . ఒక బోర్డు అధికారి సెక్రటరీ యువ క్రికెటర్‌ను బ్లాక్‌మెయిల్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

IPL 2026 Honey Trap : ఐపీఎల్ 2026లో హనీ ట్రాప్ కలకలం.. అసలు కిలాడీ ఎవరో కనిపెట్టిన బీసీసీఐ
Ipl 2026

Updated on: Jun 04, 2026 | 11:22 AM

IPL 2026 Honey Trap : ఐపీఎల్ 2026 సీజన్ క్రికెట్ హిస్టరీలోనే అత్యంత వివాదాస్పదమైన ఎడిషన్‌గా నిలిచేలా కనిపిస్తోంది. టోర్నమెంట్ ముగియడానికి ఇంకా మూడు వారాల సమయం ఉండగానే..వేపింగ్ వివాదాలు, వ్లాగింగ్ బ్యాన్లు లాంటి ఎన్నో ఇష్యూస్ చూశాం. అయితే వీటన్నింటికంటే ఘోరంగా ఇప్పుడు హనీ ట్రాప్ వ్యవహారం క్రికెట్ వర్గాలను కుదిపేస్తోంది. కొందరు ఆటగాళ్లు తమ హోటల్ రూమ్‌లలో అనధికారిక స్నేహితులు, గర్ల్‌ఫ్రెండ్స్‌తో గడుపుతున్నారని, దీనివల్ల ఐపీఎల్‌కు సంబంధించిన వ్యూహాత్మక సమాచారం బయట వ్యక్తులకు లీక్ అవుతుందనే భయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బీసీసీఐ కఠినమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్స్ తీసుకువచ్చింది.

అసలు కిలాడీ ఎవరో తేల్చేసిన నివేదిక

ఈ హనీ ట్రాప్ వివాదం వెనుక ఉన్న అసలు బాధితుడు, అలాగే ఇందుకు కారణమైన విలన్ ఎవరో బీసీసీఐ కనిపెట్టినట్లు తాజాగా క్రిక్‌బ్లాగర్ ఒక సంచలన నివేదికను బయటపెట్టింది. ఈ మొత్తం స్కాండల్ బీసీసీఐ బోర్డుకు చెందిన ఒక ఉన్నతాధికారి పర్సనల్ సెక్రటరీ దగ్గర మొదలైనట్లు తేలింది. ఐపీఎల్ 2026లో ఎలాగైనా కాంట్రాక్ట్ దక్కించుకోవాలని ఆశపడిన ఒక యంగ్ క్రికెటర్, సదరు అధికారి సెక్రటరీని సంప్రదించాడు. ఆ సెక్రటరీ దీన్ని ఆసరాగా చేసుకుని, ఐపీఎల్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మబలికి, ఆ యువ ఆటగాడిని పెద్ద మొత్తంలో కమీషన్ డబ్బులు డిమాండ్ చేసింది.

డబ్బులు ఇవ్వకపోవడంతో బ్లాక్‌మెయిల్ పర్వం

ఆ యువ క్రికెటర్ అంత సొమ్మును కమీషన్ రూపంలో ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆ సెక్రటరీ అసలు రూపాన్ని బయటపెట్టింది. క్రికెటర్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన కొన్ని విషయాలను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా, ఒక స్పోర్ట్స్ రిపోర్టర్‌తో చేతులు కలిపి.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే హనీ ట్రాప్‌లో ఇరికించి, నీ కెరీర్‌ను నాశనం చేస్తామంటూ బెదిరింపులకు దిగింది. సోషల్ మీడియాలో ఐపీఎల్ క్రికెటర్లపై వస్తున్న నెగెటివ్ వార్తలన్నింటికీ ఈ వివాదమే మూలమని, అలాగే ఒక ఐపీఎల్ ప్లేయర్ గర్ల్‌ఫ్రెండ్ టీమ్ సీక్రెట్స్‌ను బయట వ్యక్తులతో పంచుకోవడం కూడా ఇందులో భాగమేనని నివేదిక పేర్కొంది.

బీసీసీఐ మౌనం.. త్వరలోనే విచారణ

ఈ వ్యవహారంపై బీసీసీఐ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. బోర్డు వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయని, లోపల ఒక పెద్ద నెట్‌వర్క్ లేదా గ్యాంగ్ ఆపరేట్ అవుతుండటం వల్లే ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే మీడియాలో ఈ విషయం పూర్తిగా హైలైట్ అయిన తర్వాత, బీసీసీఐ చాలా వేగంగా స్పందించి ఆ సెక్రటరీతో పాటు మోసానికి పాల్పడిన వారందరినీ బహిర్గతం చేసే అవకాశం ఉంది. దీనిపై ఒక ప్రత్యేక విచారణ కమిటీని కూడా వేయాలని బోర్డు భావిస్తోంది.

హనీ ట్రాప్ అరికట్టడానికి బీసీసీఐ కొత్త రూల్స్

ఈ వివాదాల నేపథ్యంలో ఆటగాళ్లు హనీ ట్రాప్ బారిన పడకుండా బీసీసీఐ కొన్ని కఠినమైన రూల్స్ పెట్టింది. ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్ ఎవరైనా సరే టీమ్ హోటల్ వదిలి బయటకు వెళ్లాలంటే సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ లేదా యాంటీ కరప్షన్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యక్తిగత పనులైనా, వినోదం కోసమైనా సరే బయటకు వెళ్లేముందు టీమ్ మేనేజర్‌కు సమాచారం ఇవ్వాలి. అధికారులు ప్రతి ప్లేయర్ కదలికలపై ఒక లాగ్ బుక్ నిర్వహిస్తారు. ఈ రూల్స్ వచ్చిన తర్వాత ఫ్రాంచైజీలు కూడా అలర్ట్ అయ్యాయి. పంజాబ్ కింగ్స్ జట్టు తమ ప్లేయర్ అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్ ముగిసేవరకు సోషల్ మీడియాలో ఎలాంటి వ్లాగ్‌లు, వీడియోలు పెట్టకూడదని బ్యాన్ విధించింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us