IPL 2026 : దేశాన్ని అవమానించిన ఐపీఎల్ 2026 లేజర్ షో.. ఇండియా మ్యాప్‌లో కాశ్మీర్, యూపీ మాయం

IPL 2026 : ఐపీఎల్ 2026 ఆర్‌సీబీ వర్సెస్ గుజరాత్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లేజర్ షోలో భారతదేశ తప్పుడు మ్యాప్‌ను ప్రదర్శించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన నిర్వాహకులపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.

IPL 2026 : దేశాన్ని అవమానించిన ఐపీఎల్ 2026 లేజర్ షో.. ఇండియా మ్యాప్‌లో కాశ్మీర్, యూపీ మాయం
Ipl 2026

Updated on: May 27, 2026 | 7:06 AM

IPL 2026 : ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్ వేదికగా ఒక ఊహించని వివాదం చెలరేగింది. ధర్మశాలలోని ప్రసిద్ధ HPCA మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నిర్వాహకులు చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. మ్యాచ్ మధ్యలో నిర్వహించిన లేజర్ లైట్ షోలో భారతదేశం మ్యాప్‌ను తప్పుగా ప్రదర్శించడం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన నిర్వాహకులపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల క్రికెట్ స్టేడియంలో మంగళవారం రాత్రి ఇరు జట్ల మిడ్ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ప్రేక్షకులను అలరించడానికి సరికొత్త సౌండ్ అండ్ లైట్ షోను ఏర్పాటు చేశారు. సుమారు 25 నిమిషాల పాటు సాగిన ఈ లేజర్ షోలో ఐపీఎల్ ట్రోఫీపై లేజర్ కాంతులతో భారతదేశ మ్యాప్‌ను ప్రదర్శించారు. అయితే ఈ మ్యాప్‌లో జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఈశాన్య భారత రాష్ట్రాలు (నార్త్ ఈస్ట్) చాలా వరకు కనిపించలేదు. ఈ అసంపూర్ణ మ్యాప్‌ను ప్రత్యక్ష ప్రసారంలో చూసిన క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

భారతదేశ ప్రాంతీయ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న ఈ తప్పుడు మ్యాప్ విజువల్స్ నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, ప్రతిష్టాత్మకమైన లీగ్‌ను నిర్వహిస్తూ దేశ మ్యాప్‌ను కూడా సరిగ్గా ప్రదర్శించలేరా అంటూ అభిమానులు మండిపడుతున్నారు. ఈ ఘోర తప్పిదానికి కారణమైన బీసీసీఐ, ఐసీసీ చీఫ్ జై షా, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA)లపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం టెక్నికల్ గ్రాఫిక్స్ పొరపాటు మాత్రమే కాదని, దేశ గౌరవానికి సంబంధించిన తీవ్రమైన విషయమని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

ఈ వివాదం పక్కన పెడితే.. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పరుగుల వరద పారించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ క్రీజులో శివతాండవం చేశాడు. గుజరాత్ బౌలర్లను సునామీలా చుట్టుముట్టిన పటీదార్ కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ విరామంలో ప్లేఆఫ్స్ చేరిన జట్ల వివరాలు, మ్యూజికల్ పెర్ఫార్మెన్స్‌లతో షో అదిరిపోయినప్పటికీ.. చివర్లో మ్యాప్ వివాదంతో బీసీసీఐ పరువు బజారున పడింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us