
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కేవలం నాలుగు రోజుల ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయాలు తీసుకుంది. టోర్నీని మరింత పకడ్బందీగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు నాలుగు కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే ఆటగాళ్లు భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బోర్డు హెచ్చరించింది. ఆ కొత్త మార్పులేంటో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ చరిత్రలో సాధారణంగా ఆటగాళ్లు మ్యాచ్ జరిగే రోజున కూడా మైదానంలో తీవ్రంగా శ్రమిస్తూ కనిపిస్తారు. అయితే, ఐపీఎల్ 2026 నుంచి దీనిపై బీసీసీఐ నిషేధం విధించింది. ఇకపై మ్యాచ్ ఉన్న రోజున ఏ ఆటగాడు మైదానంలో ప్రాక్టీస్ చేయడానికి అనుమతి ఉండదు. పిచ్ స్వభావాన్ని కాపాడటంతో పాటు, మ్యాచ్ షెడ్యూల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జట్లకు మ్యాచ్ కంటే ముందే తగినంత సమయం కేటాయిస్తామని బోర్డు స్పష్టం చేసింది.
ఆటగాళ్ల వస్త్రధారణపై కూడా బీసీసీఐ దృష్టి సారించింది. ఇకపై ఆటగాళ్లు మైదానంలో లేదా మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే ‘పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్’ సమయంలో స్లీవ్లెస్ (భుజాలు కనిపించే) జెర్సీలు ధరించకూడదు. మొదటిసారి ఈ నిబంధనను ఉల్లంఘిస్తే హెచ్చరికతో సరిపెడతారు. కానీ, రెండోసారి తప్పు పునరావృతమైతే భారీ జరిమానా విధిస్తారు. దీనివల్ల ఆటగాళ్లందరూ జెర్సీలను ధరించడం తప్పనిసరి.
క్రమశిక్షణను పెంచే క్రమంలో బీసీసీఐ మరో కీలక మార్పు చేసింది. హోటల్ నుంచి స్టేడియానికి ఆటగాళ్లందరూ తప్పనిసరిగా టీమ్ బస్సులోనే ప్రయాణించాలి. స్వదేశీ మ్యాచ్ల సమయంలో తమ వ్యక్తిగత కార్లను వాడుకునే సౌకర్యాన్ని రద్దు చేశారు. ముఖ్యంగా, టీమ్ బస్సులో కేవలం ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ మాత్రమే ఉండాలి. కుటుంబ సభ్యులకు ఇందులో అనుమతి లేదు. అంతేకాకుండా, మ్యాచ్ రోజున ఎలాంటి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించకూడదని నిర్ణయించారు.
టౌర్నమెంట్ సమగ్రతను కాపాడేందుకు డ్రెస్సింగ్ రూమ్లోకి అనధికారిక వ్యక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. కేవలం గుర్తింపు పొందిన స్టాఫ్ మాత్రమే లోపలికి వెళ్లాలి. అలాగే మైదానంలో ఉండే సిబ్బంది సంఖ్యను కూడా పరిమితం చేశారు. వైద్యులు, అత్యవసర సిబ్బందికి మాత్రమే ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. ఈ కొత్త నిబంధనలు ఐపీఎల్ను మరింత ప్రొఫెషనల్గా మారుస్తాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..