
క్రికెట్ అభిమానుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసిన మహేంద్ర సింగ్ ధోనీ, తన ఆటతీరుతోనే కాదు, తన మాటలతో కూడా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. తన ప్రణాళికల గురించి ఎప్పుడూ సూటిగా చెప్పని ధోనీ, ఐపీఎల్ 2026లో ఆడుతారా లేదా అనే ప్రశ్నపై తనదైన శైలిలో ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

IPL 2026లో కూడా మీరు ఆడాలి సార్.. అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు, "అరే, ఘుట్నే మే జో దర్ద్ హోతా హై ఉస్కా టేక్ కేర్ కౌన్ కరేగా?" (అరే, మోకాలి నొప్పుల సంగతి ఎవరు చూసుకుంటారు?) అని ధోనీ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ సమాధానం విన్న అభిమానులు నవ్వుకున్నారు. కానీ ధోనీ చెప్పిన మాటల్లో నిజం ఉంది. IPL 2023 తర్వాత ధోనీ తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయన మోకాలి నొప్పిని భరిస్తూనే ఆడిన సంగతి తెలిసిందే.

ధోనీ ఈ మధ్యకాలంలో బ్యాటింగ్ ఆర్డర్లో దిగువకు రావడం, వికెట్ల మధ్య పరుగుల విషయంలో వేగం తగ్గడం ఆయన మోకాలి సమస్యలకు సూచనలుగా కనిపిస్తున్నాయి. అయితే, ఆయన నాయకత్వం, వికెట్ కీపింగ్ నైపుణ్యాలు ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు ఎంతో విలువైనవి.

ధోనీ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, ఆయన ఎప్పుడూ తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పలేదు. డిసెంబర్ వరకు సమయం ఉంది. అప్పుడు తన నిర్ణయాన్ని తెలియజేస్తానని ఆయన తెలిపారు. అయితే, ఆయన CSK తో తన బంధం ఎప్పటికీ ఉంటుందని, తాను ఎప్పుడూ పసుపు రంగు జెర్సీలోనే ఉంటానని చెప్పి అభిమానుల మనసు దోచుకున్నారు.

మరి ఈ క్రమంలో ధోనీ ఆటగాడిగా ఉంటారా, లేదా మరో పాత్రలో కనిపిస్తారా అనేది త్వరలోనే తేలనుంది. కానీ, ఆయన మాటలు మాత్రం ఇప్పుడు వైరల్ అవుతూ, ఆయన అభిమానులకు ఎంతో ఆశాభావం కలిగిస్తున్నాయి.