
IND vs SA Playing 11 : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలైన అసలైన సమరానికి తెరలేచింది. ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్లు సూపర్-8 పోరులో తలపడనున్నాయి. గత టీ20 వరల్డ్ కప్ ఫైనలిస్టుల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ అంటే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఈ మ్యాచ్కు ముందు టీమిండియా తుది జట్టు (Playing-11) విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా మూడు మ్యాచ్ల్లో సున్నాకే అవుట్ కావడంతో, అతని స్థానంలో సంజూ శాంసన్ను తీసుకుంటారా అన్న సందేహాలు మొదలయ్యాయి.
శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో సంజూ శాంసన్ నెట్స్లో చాలా సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంతో, అతను తుది జట్టులోకి వస్తున్నాడనే ఊహాగానాలు జోరందుకున్నాయి. సాధారణంగా మ్యాచ్కు ముందు ఎవరైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో, వారు ప్లేయింగ్-11లో ఉండే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందు ఉంచగా, ఆయన చాలా ఆసక్తికరంగా స్పందించారు. “ఏంటి.. సంజూను ఆడించడం కోసం అభిషేక్ శర్మను తప్పించమంటారా? లేక నంబర్-3లో ఆడుతున్న తిలక్ వర్మను పక్కన పెట్టమంటారా?” అంటూ ఎదురు ప్రశ్న వేశారు. దీన్ని బట్టి చూస్తుంటే, టీమ్ మేనేజ్మెంట్ అభిషేక్ శర్మపైనే పూర్తి నమ్మకంతో ఉన్నట్లు అర్థమవుతోంది.
జట్టు ప్రదర్శనపై వస్తున్న విమర్శలను కూడా సూర్య సున్నితంగా తిప్పికొట్టారు. “ప్రస్తుతం అంతా బాగానే ఉంది. పవర్ప్లేలో 40-50 పరుగులు వస్తున్నాయి. మనం ద్వైపాక్షిక సిరీస్లలో భారీ స్కోర్లు సాధించడంతో అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. ప్రతి మ్యాచ్లోనూ 220-240 పరుగులు చేయాలని ఆశించడం సహజమే. కానీ ఇక్కడి వికెట్లు కొంచెం భిన్నంగా ఉన్నాయి. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ పరిస్థితులు వేరుగా ఉన్నాయి, వాటికి తగ్గట్టే మేము ఆడుతున్నాం అని సూర్య చెప్పుకొచ్చారు.
ఓపెనింగ్ జోడీలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కొనసాగే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే బలాన్ని ఇస్తారు. బౌలింగ్ విభాగంలో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మధ్య పోటీ ఉన్నప్పటికీ.. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్కే మొగ్గు ఎక్కువగా ఉంది. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో విశ్రాంతి తీసుకున్న అక్షర్, ఇప్పుడు కీలకమైన సౌతాఫ్రికా మ్యాచ్లోకి నేరుగా వచ్చే అవకాశం ఉంది. వరుణ్ చక్రవర్తి స్పిన్ అమ్ములపొదిలో కీలక అస్త్రంగా మారగా, బుమ్రా-అర్ష్దీప్ పేస్ భారాన్ని మోయనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..