
Asia Cup 2026: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మహిళల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై అద్భుత విజయం సాధించి టీమిండియా రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ఛాంపియన్గా అవతరించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత విజేతగా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీ అందజేసే సమయమే అసలు వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు స్పష్టంగా అభ్యంతరం తెలిపింది. సరిగ్గా ఇదే తరహాలో 2025 సెప్టెంబర్లో జరిగిన పురుషుల ఆసియా కప్ ఫైనల్లోనూ పాకిస్థాన్ను ఓడించిన తర్వాత నాటి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.
బీసీసీఐ కార్యదర్శితో సుదీర్ఘ చర్చలు
ట్రోఫీ ప్రదానోత్సవ వేదికపై మొహసిన్ నఖ్వీ ఎంతో ఆశగా నిలబడగా, భారత ఆటగాళ్లు మాత్రం మైదానంలోనే ఉండిపోయారు. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాతో భారత జట్టు పెద్ద ఎత్తున చర్చలు జరిపింది. నఖ్వీ చేతుల నుంచి కప్పు తీసుకోకూడదనే తమ పట్టును క్రీడాకారులు వీడలేదు. ఎంత సేపు వేచి చూసినా పరిస్థితి మారకపోవడంతో తీవ్ర అవమానభారంతో నఖ్వీ పోడియం దిగి వేగంగా మైదానం వెలుపలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత తన కారులో ఆయన అక్కడి నుంచి నిష్క్రమించడంతో దుబాయ్ స్టేడియంలో తీవ్ర కలకలం రేగింది.
Mohsin Naqvi has left the Stedium. #WomensAsiaCup #AsiaCup #INDWvSLW pic.twitter.com/MEUCxIKDy9
— IMRAN (@Rustomimran2) September 13, 2026
పాక్ మంత్రి భారత్ వ్యతిరేక వైఖరే కారణం
మొహసిన్ నఖ్వీ కేవలం ఏసీసీ చీఫ్ మాత్రమే కాకుండా పాకిస్థాన్ దేశ హోంమంత్రి కూడా కావడంతో ఆయన రాజకీయంగా భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. గతంలో ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్పై ఆయన చేసిన వివాదాస్పద ప్రకటనలు తీవ్ర దుమారం రేపాయి. పాకిస్థాన్తో ఆడే మ్యాచ్లలో భారత జట్లు ప్రత్యర్థి కెప్టెన్తో కనీసం షేక్ హ్యాండ్ చేయకూడదనే సంప్రదాయాన్ని గతంలోనే సూర్యకుమార్ సేన ప్రారంభించింది. ఇప్పుడు అదే బాటలో నడిచిన హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని మహిళా జట్టు కూడా నఖ్వీ చేతుల మీదుగా కప్పు అందుకోబోమని తేల్చిచెప్పింది.
లంకను చిత్తు చేసి రికార్డు విజయం
ఈ ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో తడబడిన శ్రీలంక జట్టు కేవలం 111 పరుగులకే ఆలైట్ కావడంతో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సెమీఫైనల్లో పాకిస్థాన్ను ఓడించి టోర్నీ నుంచి పంపిణీ చేసిన శ్రీలంకపై భారత మహిళలు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. మైదానంలో అద్భుతమైన ప్రదర్శనతో కప్పు గెలిచినా, ట్రోఫీ ప్రదానోత్సవంలో చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామాలు ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్గా మారాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..