IND VS WI: చారిత్రాత్మక వన్డేలో టీమిండియా ఘన విజయం.. స్మార్ట్ కెప్టెన్సీతో ఆకట్టుకున్న రోహిత్..

|

Feb 06, 2022 | 8:09 PM

భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేలో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

IND VS WI: చారిత్రాత్మక వన్డేలో టీమిండియా ఘన విజయం.. స్మార్ట్ కెప్టెన్సీతో ఆకట్టుకున్న రోహిత్..
India Vs West Indies 1st Odi
Follow us on

అహ్మదాబాద్ వేదికగా జరుగుతోన్న వన్డే సిరీస్ (India vs West Indies, 1st ODI) తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. అద్భుత ప్రదర్శనతో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి వెస్టిండీస్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 177 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా(Team India) కేవలం 28 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ(Rohit Sharma) 60, ఇషాన్ కిషన్ 28 పరుగులతో కీలక భాగస్వామ్యం అందించడంతోపాటు చివర్లో సూర్యకుమార్ 34, దీపక్ హుడా 26 పరుగులతో కీలక భాగస్వామ్యం అందించి విజయాన్ని అందించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో దూసుకెళ్లింది. విరాట్ 8, పంత్ 11 పరుగులు చేశారు.

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టుపై భారత బౌలర్లు విధ్వంసం సృష్టించారు. వెస్టిండీస్ జట్టు కేవలం 176 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చాహల్‌లు వెస్టిండీస్‌కు ఎక్కువ నష్టం కలిగించారు. యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) 4 వికెట్లు తీశాడు . వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీశాడు. 57 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన జాసన్ హోల్డర్ వెస్టిండీస్ తరపున అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఫాబియన్ అలెన్ కూడా 29 పరుగులు చేశాడు. వీరిద్దరి మధ్య అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొనడంతో వెస్టిండీస్ జట్టు 176 పరుగులకు చేరుకోగలిగింది.

అత్యుత్తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్న భారత్ ..
వెస్టిండీస్ వికెట్ కీపర్ షాయ్ హోప్ బలమైన ఆరంభాన్ని అందించాడు. రెండు ఫోర్లు కొట్టడం ద్వారా తన ఫామ్‌లో ఉన్నట్లు సంకేతాలను చూపించాడు. అయితే మరో వైపు సిరాజ్ తన బౌలింగ్‌లో షే హోప్‌ను బౌల్డ్ చేసి వెస్టిండీస్‌కు తొలి దెబ్బ రుచిచూపించాడు. దీని తర్వాత, బ్రాండన్ కింగ్, డారెన్ బ్రావో గేమ్‌ను 11వ ఓవర్‌కు తీసుకెళ్లారు. అయితే వాషింగ్టన్ సుందర్ రాకతో అంతా మారిపోయింది. 12వ ఓవర్లో సుందర్ మొదట బ్రాండన్ కింగ్‌ను అవుట్ చేసి, ఆ తర్వాత డారెన్ బ్రావోను ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. దీని తర్వాత, రోహిత్ శర్మ.. యుజ్వేంద్ర చాహల్‌ను రంగంలోకి దింపాడు. 20వ ఓవర్‌లో నికోలస్ పూరన్, కెప్టెన్ కీరన్ పొలార్డ్‌లను వరుసగా రెండు బంతుల్లో అవుట్ చేయడం ద్వారా వెస్టిండీస్ వెన్ను విరిచాడు. వెస్టిండీస్ 20వ ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయింది. 22వ ఓవర్లో చాహల్ షెమ్రాన్ బ్రూక్స్ కూడా ఔట్ చేశాడు. మరుసటి ఓవర్‌లో, ప్రసిద్ధ కృష్ణ తన బౌలింగ్‌లో అకీల్ హుస్సేన్‌ను పెవిలియన్ చేర్చాడు.

జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్ వెస్టిండీస్ జట్టును కష్టాల నుంచి రక్షించారు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్‌కు 91 బంతుల్లో 78 పరుగులు జోడించారు. జాసన్ హోల్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 58 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని 38వ ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్ విడదీశాడు. ఆతర్వాత 41వ ఓవర్‌లో ప్రసీద్ధ్ క్రిష్ణ హోల్డర్‌ను ఔట్ చేసి విండీస్‌కు మరో దెబ్బ తీశాడు. చివర్లో చాహల్ అల్జారీ జోసెఫ్‌ను అవుట్ చేయడంతో విండీస్ టీం కేవలం 43.5 ఓవర్లలో 176 పరుగులకు కుప్పకూలింది.

Also Read: U19 World Cup: అండర్ 19 ఛాంపియన్లపై బీసీసీఐ కీలక ప్రకటన.. విండీస్ నుంచి నేరుగా అహ్మదాబాద్‌కే.. ఎందుకంటే?

Watch Video: రిషబ్ వద్దన్నా.. కోహ్లీ మాటనే ఫైనల్ చేసిన రోహిత్.. ఎందుకో తెలుసా? వైరలవుతోన్న వీడియో..!