
India vs Pakistan Women: క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ పోరంటే అభిమానులకు పూనకాలే. త్వరలో యుఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్లో ఈ రెండు జట్లు తలాపడటానికి సర్వం సిద్ధమైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో 15 మందితో కూడిన బలమైన భారత జట్టును ఎంపిక చేయడంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
మైదానంలో భారత్, పాకిస్తాన్ తలాపడితే వ్యాపారపరంగా, వినోదపరంగా వచ్చే క్రేజ్ వేరే స్థాయిలో ఉంటుంది. ఈ సారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరగనుండటంతో అభిమానులతో పాటు ప్రసారకర్తలు కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 మధ్యలో జరిగే ఈ మెగా టోర్నీలో కనీసం ఒక్కసారైనా పాక్ను చిత్తు చేసేందుకు మన మహిళల సేన సిద్ధమవుతోంది.
టోర్నీకి సంబంధించి కీలక బాధ్యతలను మళ్లీ సీనియర్లకే అప్పగించారు. అనుభవజ్ఞురాలైన హర్మన్ప్రీత్ కౌర్ జట్టుకు సారథ్యం వహిస్తుండగా, వైస్ కెప్టెన్గా స్మృతి మంధాన వ్యవహరిస్తున్నారు. బ్యాటింగ్ విభాగంలో షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, వికెట్ కీపర్ రిచా ఘోష్ వంటి విధ్వంసకర ప్లేయర్లు ఉండటం జట్టుకు పెద్ద బలంగా మారింది. యుఏఈ పిచ్లకు తగినట్లుగా దీప్తి శర్మ, రాధా యాదవ్ వంటి ఆల్రౌండర్లు కూడా తుది జట్టులో కీలక పాత్ర పోషించనున్నారు.
టీ20 ప్రపంచకప్లో బౌలింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఈ టోర్నీకి దూరం కావలసి వచ్చింది. కోలుకోవడానికి మరింత సమయం పడుతుండటంతో ఆమెను పక్కన పెట్టారు. శ్రేయాంక స్థానంలో అద్భుత లెగ్ స్పిన్ వేసే ప్రేమా రావట్కు మరోసారి అవకాశం దక్కింది. యువ వికెట్ కీపర్ జి. కమలినిని కొనసాగించడం ద్వారా సెలెక్టర్లు యువ రక్తంపై నమ్మకం ఉంచారు.
ఆసియా కప్నకు ఎంపిక చేసిన భారత్ జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, ప్రేమా రావట్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, నందిని శర్మ, క్రాంతి గౌడ్.
రిజర్వ్ ఆటగాళ్ల జాబితా: ప్రతిక రావల్, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), వైష్ణవి శర్మ, సయాలీ సత్ఘరే, మిన్ను మణి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..