IND vs ZIM : వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై రచ్చ.. జింబాబ్వే టూర్‌కు బయలుదేరిన యంగ్ టీమిండియా

IND vs ZIM : జింబాబ్వే పర్యటన కోసం యువ టీమిండియా బయలుదేరింది. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టగా, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జింబాబ్వేతో తలపడనుంది.

IND vs ZIM : వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై రచ్చ.. జింబాబ్వే టూర్‌కు బయలుదేరిన యంగ్ టీమిండియా
Ind Vs Zim

Updated on: Jul 19, 2026 | 12:25 PM

IND vs ZIM : భారత క్రికెట్ జట్టు తదుపరి మిషన్ కోసం రెడీ అయింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా త్వరలోనే జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడబోతోంది. ఈ పర్యటన కోసం భారత యువ ఆటగాళ్ల బృందం ఇప్పటికే జింబాబ్వేకు బయలుదేరింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు మిగిలిన సీనియర్ ప్లేయర్లు మూడో వన్డే మ్యాచ్ ముగిసిన తర్వాత నేరుగా జింబాబ్వేలో జట్టుతో కలవనున్నారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జట్టుతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ టూర్‌కు వెళ్లడం లేదు.

హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐ రెస్ట్

క్రికెట్ క్యాలెండర్‌లో వరుస మ్యాచ్‌ల బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఈ పర్యటన నుండి మినహాయింపు ఇచ్చారు. గంభీర్ స్థానంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (ప్రస్తుత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) హెడ్, టీమిండియా మాజీ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్‌ను ఈ సిరీస్‌కు తాత్కాలిక హెడ్ కోచ్‌గా బోర్డు నియమించింది. గతంలో రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో కూడా లక్ష్మణ్ ఇలాగే పలు విదేశీ పర్యటనల్లో యువ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. లక్ష్మణ్‌కు యువ ఆటగాళ్లతో కలిసి పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉండటం జట్టుకు ప్లస్ పాయింట్ కానుంది.

టీ20ల్లో గంభీర్ కోచింగ్‌పై వస్తున్న విమర్శలు

గంభీర్ ఈ పర్యటనకు వెళ్లకపోవడానికి వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణమని బోర్డు చెబుతున్నప్పటికీ, ఇటీవల టీమిండియా ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గంభీర్ కోచింగ్‌లో భారత జట్టు టీ20 ఫార్మాట్‌లో అత్యంత పేలవమైన ప్రదర్శనను నమోదు చేసింది. ఇటీవలే ఐర్లాండ్ చేతిలో 0-2 తో ఓడిపోయిన భారత్, ఆ తర్వాత ఇంగ్లాండ్ చేతిలో 0-4 తో క్లీన్‌స్వీప్ అయింది. ఇలా వరుసగా 6 టీ20 మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో గంభీర్ కోచింగ్ శైలిపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ డెబ్యూను గంభీర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ కోచింగ్‌లో యువ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.

గురువారం నుంచే భారత్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్‌లు

భారత్, జింబాబ్వే మధ్య జరగబోయే ఈ టీ20 సిరీస్ మొత్తం మూడు మ్యాచ్‌ల ఫార్మాట్‌లో సాగనుంది. సిరీస్‌లోని తొలి పోరు గురువారం, జులై 23వ తేదీన హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగబోతోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రెండో టీ20 జులై 25న, మూడో అలాగే ఆఖరి టీ20 మ్యాచ్ జులై 26న (ఆదివారం) జరగనున్నాయి. సిరీస్‌లోని ఈ మూడు మ్యాచ్‌లు కూడా హరారే వేదికగానే జరగబోతున్నాయి. అన్ని మ్యాచ్‌లు కూడా సాయంత్రం 4:30 గంటలకే షెడ్యూల్ చేయబడ్డాయి.

జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, శివం దూబే, అభిషేక్ శర్మ, యశ్ ఠాకూర్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us