IND vs WI T20WC Records : వెస్టిండీస్‌తో సెమీస్ యుద్ధం.. పాత రికార్డులు చూస్తే టీమిండియాకు వణుకు పుట్టాల్సిందే

IND vs WI T20WC Records :టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8లో భారత్-వెస్టిండీస్ మధ్య జరగనున్న కీలక పోరు సెమీఫైనల్ భవితవ్యాన్ని తేల్చనుంది. హెడ్ టు హెడ్ రికార్డులో విండీస్ ఆధిక్యంలో ఉన్నా, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా పాత చేదు జ్ఞాపకాలకు ముగింపు పలకాలని సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్‌లో ఉత్కంఠభరిత సమరం ఖాయం.

IND vs WI T20WC Records : వెస్టిండీస్‌తో సెమీస్ యుద్ధం.. పాత రికార్డులు చూస్తే టీమిండియాకు వణుకు పుట్టాల్సిందే
Ind Vs Wi T20wc Records

Updated on: Mar 01, 2026 | 10:32 AM

IND vs WI T20WC Records : టీ20 వరల్డ్ కప్ 2026లో ఇప్పుడు అందరి దృష్టి భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న సూపర్ 8 పోరుపైనే ఉంది. ఈ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, టీమిండియా సెమీఫైనల్ భవితవ్యాన్ని తేల్చే చావోరేవో సమరం. సూర్యకుమార్ యాదవ్ సారధ్యంలోని భారత జట్టు ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్ టికెట్ ఖరారవుతుంది. అయితే, మైదానంలోకి దిగే ముందు చరిత్రను ఓసారి తిరగేస్తే భారత అభిమానులకు కొంచెం గుబులు పుట్టించే నిజాలు కనిపిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరాటాల్లో విండీస్ దే పైచేయిగా ఉంది.

ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్, వెస్టిండీస్ జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి. ఇందులో వెస్టిండీస్ ఏకంగా మూడు సార్లు గెలవగా, భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. అంటే హెడ్-టు-హెడ్ రికార్డులో కరేబియన్ జట్టు 3-1తో ఆధిక్యంలో ఉంది. 2009లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమై ఓడిపోయింది. ఆ తర్వాత 2010లో విండీస్ గడ్డపై జరిగిన మ్యాచ్‌లో కూడా పర్యాటక జట్టు ధాటికి భారత్ తలవంచక తప్పలేదు. ఈ రెండు ఓటములు అప్పట్లో టీమిండియాను టోర్నీ నుంచి దెబ్బతీశాయి.

భారత్ తన పగను 2014 వరల్డ్ కప్‌లో తీర్చుకుంది. ఆ టోర్నీలో భారత బౌలర్లు చెలరేగి విండీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. అనంతరం బ్యాటర్లు సంయమనంతో ఆడి తొలిసారి వరల్డ్ కప్ వేదికగా విండీస్‌పై విజయాన్ని నమోదు చేశారు. అయితే, 2016 సెమీఫైనల్ ఓటమి మాత్రం భారతీయులకు ఇప్పటికీ ఒక తీరని వేదన. వాంఖడే స్టేడియంలో భారత్ భారీ స్కోరు చేసినప్పటికీ, విండీస్ హిట్టర్లు సిక్సర్ల వర్షం కురిపించి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఆ తర్వాత వారే ఛాంపియన్లుగా అవతరించారు. ఆ చేదు జ్ఞాపకం పదేళ్ల తర్వాత కూడా ఇంకా వెంటాడుతూనే ఉంది.

ప్రస్తుత పరిస్థితి చూస్తే, ఈ గ్రూప్ నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే సెమీస్ చేరిపోయింది. రెండో స్థానం కోసం భారత్, వెస్టిండీస్ మధ్య యుద్ధం నడుస్తోంది. చరిత్ర విండీస్ వైపు ఉన్నా, ప్రస్తుత ఫామ్, టీమ్ బ్యాలెన్స్ చూస్తే సూర్య సేన చాలా బలంగా ఉంది. ఈసారి పాత రికార్డులను చెరిపివేసి, 2016 నాటి సెమీస్ పగను తీర్చుకోవాలని భారత ఆటగాళ్లు కసిగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్ దారి సుగమం అవుతుంది కాబట్టి, ఈడెన్ గార్డెన్స్‌లో మరో ఉత్కంఠభరిత పోరు ఖాయమనిపిస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us