IND vs SL: తొలి టెస్టుకు ముందే శ్రీలంకకు షాక్.. స్టార్ ఓపెనర్ అవుట్, సీనియర్‌కు చోటు

IND vs SL: భారత్‌తో తొలి టెస్టుకు ముందు శ్రీలంకకు షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఓపెనర్ పథుమ్ నిసాంక సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు సీనియర్ వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. గాల్ టెస్టు కోసం శ్రీలంక 16 మంది జట్టును ప్రకటించింది. కొత్త ఆఫ్‌స్పిన్నర్ కేశర నువంతకు కూడా అవకాశం దక్కింది. భారత్‌తో పోరుకు లంక సిద్ధమైంది.

IND vs SL: తొలి టెస్టుకు ముందే శ్రీలంకకు షాక్.. స్టార్ ఓపెనర్ అవుట్, సీనియర్‌కు చోటు
Ind Vs Sl

Updated on: Aug 12, 2026 | 4:59 PM

IND vs SL: గాల్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆగస్టు 15 నుంచి భారతదేశంతో ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు తమ 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ధనంజయ డి సిల్వా సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఈ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం కారణంగా స్టార్ ఓపెనింగ్ బ్యాటర్ పథుమ్ నిసాంక ఈ సిరీస్ నుంచి తప్పుకోవడం శ్రీలంకకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. భారత జట్టు ఇప్పటికే గాల్ నగరానికి చేరుకుని తీవ్రంగా శ్రమిస్తోంది.

సీనియర్ల రీ-ఎంట్రీ..కొత్త ప్లేయర్‌కు ఛాన్స్

లకన్ జట్టులోకి సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా మళ్లీ తిరిగొచ్చాడు. 33 ఏళ్ల డిక్వెల్లా ఇప్పటివరకు 54 టెస్టుల్లో 2,757 పరుగులు సాధించి జట్టుకు నమ్మకమైన ఆటగాడిగా నిలిచాడు. వీరితో పాటు అన్‌క్యాప్డ్ ఆఫ్‌స్పిన్నర్ కేశర నువంతను కూడా జట్టులోకి తీసుకున్నారు. గాల్ స్టేడియంలో స్పిన్‌కు బాగా అనుకూలించే పిచ్‌లపై అతడి బౌలింగ్ శ్రీలంకకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.

శ్రీలంక తొలి టెస్టు జట్టు

ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కామిందు మెండిస్ (వైస్ కెప్టెన్), లాహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేష్ చండిమాల్, పసిందు సోరియబండార, సోనాల్ దినుష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), రమేష్ మెండిస్, ప్రభాత్ జయసూర్య, కేశర నువంత, మిలన్ రత్నాయకే, అసిథ ఫెర్నాండో, లాహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, దిల్షాన్ మదుశంక.

గాల్ పిచ్‌పై ఇరు జట్ల రికార్డులు

గాల్ అంతర్జాతీయ స్టేడియంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇప్పటివరకు 5 టెస్టులు జరగగా.. అందులో శ్రీలంక 3, భారత్ 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. చివరిసారిగా 2017లో ఇక్కడ టెస్టు ఆడిన టీమిండియా 304 పరుగుల భారీ తేడాతో లంకను ఓడించింది. అయితే ప్రస్తుత భారత జట్టులో రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, కుల్‌దీప్ యాదవ్ మినహా మిగిలిన ఆటగాళ్లంతా శ్రీలంక గడ్డపై తొలిసారి టెస్టు ఆడుతుండటం గమనార్హం. కాగా ఈ మ్యాచ్‌ను భారత కాలమానం ప్రకారం ఆగస్టు 15న ఉదయం 10:00 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us