IND vs SA 2nd ODI : రుతురాజ్, కోహ్లీ సెంచరీలతో 359 పరుగుల భారీ లక్ష్యం.. సఫారీలకు సీరీస్ గండం
భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా రెండవ మ్యాచ్ రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లోనూ టీమిండియాకు టాస్ కలిసి రాలేదు. సౌతాఫ్రికా టాస్ గెలిచి భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. గత మ్యాచ్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

IND vs SA 2nd ODI : భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా రెండవ మ్యాచ్ రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లోనూ టీమిండియాకు టాస్ కలిసి రాలేదు. సౌతాఫ్రికా టాస్ గెలిచి భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. గత మ్యాచ్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. సౌతాఫ్రికా జట్టులో కెప్టెన్ టెంబా బావుమా, కేశవ్ మహారాజ్, లుంగీ ఎంగిడి తిరిగి వచ్చారు.
టాప్ ఆర్డర్ తడబాటు
మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనింగ్లో పెద్ద భాగస్వామ్యం లభించలేదు. ఫస్ట్ వన్డే మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో కేవలం 14 పరుగులకే (8 బంతుల్లో 3 ఫోర్లు) నాండ్రే బర్గర్ బౌలింగ్లో ఔటయ్యాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా నిరాశపరిచాడు, 38 బంతుల్లో 22 పరుగులు చేసి మార్కో జాన్సెన్కు చిక్కాడు. దీంతో 10 ఓవర్లకే భారత్ 2 వికెట్లు కోల్పోయి స్వల్ప తడబాటుకు గురైంది.
రుతురాజ్, కోహ్లీ విధ్వంసం
2 వికెట్లు త్వరగా పడిన తర్వాత క్రీజ్లో జత కట్టిన విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ భారత ఇన్నింగ్స్ను పూర్తిగా మార్చేశారు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్కు ఏకంగా 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యువ ఓపెనర్ రుతురాజ్, 77 బంతుల్లో తన కెరీర్లో మొదటి వన్డే సెంచరీని నమోదు చేశాడు. అతను 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో మొత్తం 105 పరుగులు చేసి మార్కో జాన్సెన్కు ఔటయ్యాడు.
రాంచీ సెంచరీ ఫామ్ను కొనసాగిస్తూ, కోహ్లీ 90 బంతుల్లో తన 53వ వన్డే సెంచరీని పూర్తి చేశాడు. ఈ సెంచరీ ఇంటర్నేషనల్ క్రికెట్లో కోహ్లీకి 84వ సెంచరీ కావడం విశేషం. అతను 93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో మొత్తం 102 పరుగులు చేసి లుంగీ ఎంగిడి బౌలింగ్లో ఔటయ్యాడు.
కేఎల్ రాహుల్ మెరుపు ముగింపు
కోహ్లీ ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆఖరి ఓవర్లలో మెరుపులు మెరిపించాడు. ఒకవైపు వాషింగ్టన్ సుందర్ (1 పరుగు) త్వరగా రనౌట్ అయినా, రాహుల్ మాత్రం ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా కేవలం 33 బంతుల్లోనే తన 20వ వన్డే హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. చివర్లో రవీంద్ర జడేజా (24 నాటౌట్) తో కలిసి రాహుల్ (66 నాటౌట్) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. చివరి ఓవర్లో భారత్ 18 పరుగులు రాబట్టింది.
సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం
భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా జట్టు సీరీస్లో నిలబడాలంటే 359 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సఫారీలకు, భారత బ్యాట్స్మెన్ల విధ్వంసం పెద్ద షాక్ను ఇచ్చింది.




