
IND vs PAK : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఒకే ఒక్క మొండి నిర్ణయం ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా కనిపిస్తోంది. 2026 టీ20 వరల్డ్ కప్లో ఆడతామని చెబుతూనే, ఫిబ్రవరి 15న శ్రీలంకలో భారత్తో జరగాల్సిన మ్యాచ్ను మాత్రం బహిష్కరిస్తామని పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం వల్ల భారత్కు వచ్చే నష్టం కంటే పాకిస్థాన్కు కలిగే నష్టమే వంద రెట్లు ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం పాక్ బోర్డు ఎదుర్కోబోయే ఆ ఐదు ప్రధాన నష్టాలు ఏంటో చూద్దాం.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొంపముంచే 5 ప్రధాన నష్టాలు ఇవే
1. టీ20 వరల్డ్ కప్ నుంచి నిషేధం
ఐసీసీ టోర్నమెంట్లలో పాల్గొంటామని సంతకం చేసిన తర్వాత, కేవలం ఒక జట్టుపైనే ఆడనని మొండికేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. భారత్తో మ్యాచ్ ఆడకపోతే పాకిస్థాన్ను టోర్నీ నుంచి మొత్తం తొలగించే అవకాశం ఉంది. ఇప్పటికే బంగ్లాదేశ్ తన తెలివితక్కువ పనులతో టోర్నీ నుంచి తప్పుకోగా, ఇప్పుడు పాక్ కూడా అదే దారిలో వెళ్లేలా ఉంది. ఐసీసీ గనుక నిషేధం విధిస్తే పాక్ క్రికెట్ చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే అవుతుంది.
2. నిధుల నిలిపివేత.. ఆర్థికంగా దివాళా
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి ఏటా సుమారు 34.51 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.316 కోట్లు) ఆదాయం వస్తుంది. నిబంధనలు అతిక్రమిస్తే ఈ నిధులను ఐసీసీ నిలిపివేస్తుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్కు ఈ నిధులు అందకపోతే, కనీసం ఆటగాళ్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. దేశం మొత్తం దివాళా స్థితికి చేరుకుంటుంది.
3. భారీ జరిమానా.. బ్రాడ్కాస్టర్ల ఆగ్రహం
భారత్-పాక్ మ్యాచ్ అంటే ప్రపంచంలోనే అత్యధిక వ్యూయర్ షిప్ వచ్చే ఈవెంట్. దీనికోసం జియోస్టార్ వంటి బ్రాడ్కాస్టర్లు వేల కోట్లు ఖర్చు చేస్తారు. కేవలం 10 సెకన్ల యాడ్ స్లాట్ ధర ఆకాశంలో ఉంటుంది. ఇప్పుడు మ్యాచ్ రద్దు అయితే ఆ నష్టాన్ని పాకిస్థాన్ చెల్లించాల్సి ఉంటుంది. జియోస్టార్కు భారీ స్థాయిలో పరిహారం కట్టాలంటే పాక్ బోర్డు ఆస్తులు అమ్ముకోవాల్సిందే.
4. ద్వైపాక్షిక సిరీస్లపై బ్యాన్
ఐసీసీ కఠినంగా వ్యవహరిస్తే ఇతర దేశాలతో పాక్ ఆడే ద్వైపాక్షిక సిరీస్లపై కూడా నిషేధం విధిస్తుంది. ఏ దేశం కూడా పాక్తో ఆడటానికి ముందుకు రాదు. క్రికెట్ ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా ఆగిపోతుంది. ఇది పిసిబిని ఒక అనాథ బోర్డుగా మార్చే ప్రమాదం ఉంది.
5. పీఎస్ఎల్కు విదేశీ ఆటగాళ్ల దూరం
పాకిస్థాన్ గర్వంగా చెప్పుకునే పీఎస్ఎల్ లీగ్ కూడా కుప్పకూలిపోవచ్చు. ఎందుకంటే, ఐసీసీతో గొడవ పడ్డ బోర్డు నిర్వహించే లీగ్ కు విదేశీ ఆటగాళ్లను పంపడానికి ఇతర దేశాల క్రికెట్ బోర్డులు ఎన్ఓసీ ఇవ్వవు. విదేశీ ఆటగాళ్లు లేని పీఎస్ఎల్ కు క్రేజ్ ఉండదు, స్పాన్సర్లు రారు. దీంతో పాక్ క్రికెట్ పునాదులతో సహా కదిలిపోతుంది.