IND vs IRE : ఐర్లాండ్ చేతిలో ఓటమి మాత్రమే కాదు.. టీమిండియా ఖాతాలో 5 అవమానకర రికార్డులు

IND vs IRE : ఐర్లాండ్‌తో తొలి టీ20లో భారత్ 34 పరుగుల తేడాతో ఓడిపోవడమే కాకుండా ఐదు అవమానకర రికార్డులను నమోదు చేసింది. శ్రేయస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణ పేలవ ప్రదర్శనతో పాటు చారిత్రాత్మక ఓటమి అభిమానులను నిరాశకు గురిచేసింది.

IND vs IRE : ఐర్లాండ్ చేతిలో ఓటమి మాత్రమే కాదు.. టీమిండియా ఖాతాలో 5 అవమానకర రికార్డులు
Ind Vs Ire

Updated on: Jun 27, 2026 | 12:49 PM

IND vs IRE : ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టుకు పెద్ద అవమానం ఎదురైంది. 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 148 పరుగులకే కుప్పకూలిపోయి 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం మ్యాచ్ మాత్రమే ఓడిపోలేదు, తమ ఖాతాలో ఎవరూ కోరుకోని ఐదు అత్యంత అవమానకర రికార్డులను కూడా లిఖించుకుంది.

ఐర్లాండ్ చేతిలో చారిత్రాత్మక పరాజయం

భారత క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడం ఇదే తొలిసారి. 2007వ సంవత్సరంలో ఈ రెండు దేశాల మధ్య మొదటి అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన 11 మ్యాచ్‌ల్లోనూ భారత్ అజేయంగా నిలిచింది. కానీ తాజా మ్యాచ్‌లో ఐర్లాండ్ అద్భుత ప్రదర్శనతో భారత్‌పై తొలి విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీనితో అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ను ఓడించిన 11వ జట్టుగా ఐర్లాండ్ నిలిచింది.

వరల్డ్ కప్ సెంటిమెంట్ మళ్లీ రిపీట్

టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆడిన తన మొదటి మ్యాచ్‌లోనే ఘోరంగా ఓడిపోయింది. గతంలో 2024లో టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా నిలిచిన వెంటనే జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత్, అక్కడ జరిగిన మొదటి మ్యాచ్‌లోనే ఓడిపోయింది. ఇప్పుడు 2026లో కూడా సరిగ్గా అదే సీన్ రివర్స్ అయింది. వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న భారత్‌కు మొదటి మ్యాచ్‌లోనే పరాజయం ఎదురైంది.

ప్రసిద్ధ్ కృష్ణ అత్యంత ఖరీదైన బౌలింగ్ రికార్డు

భారత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఆయన తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు ఆడిన తన మునుపటి టీ20 మ్యాచ్‌లో కూడా ఆయన 68 పరుగులు ఇచ్చాడు. దీనితో వరుసగా రెండు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో కలిపి ఏకంగా 125 పరుగులు సమర్పించుకున్న మొదటి భారతీయ బౌలర్‌గా ప్రసిద్ధ్ కృష్ణ ఒక అపకీర్తిని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐర్లాండ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఓవర్

ఈ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బౌలింగ్ స్పెల్ ఆయనకు ఒక పీడకలలా మిగిలిపోనుంది. మ్యాచ్ 17వ ఓవర్ వేసిన ఆయన బౌలింగ్‌లో ఐర్లాండ్ బ్యాటర్లు ఉతికేసారు. ముఖ్యంగా గారెత్ డెలానీ వరుసగా మూడు సిక్సర్లు బాదడంతో ఆ ఒక్క ఓవర్లోనే ఐర్లాండ్ జట్టు ఏకంగా 27 పరుగులు రాబట్టింది. దీనితో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ పరుగులు ఇచ్చిన భారత బౌలర్‌గా ప్రసిద్ధ్ రికార్డు సృష్టించాడు.

కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శ్రేయస్ అయ్యర్ ఫ్లాప్

భారత పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇది మొదటి మ్యాచ్. కానీ దురదృష్టవశాత్తు కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లోనే ఆయనకు ఓటమి ఎదురైంది. దీనితో అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా చేసిన మొదటి మ్యాచ్‌లోనే ఓడిపోయిన నాలుగో భారతీయ కెప్టెన్‌గా అయ్యర్ నిలిచాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ కూడా కెప్టెన్‌గా తమ మొదటి టీ20 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూశారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us