
IND vs ENG 4th Test: ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో ఉత్కంఠ పరాకాష్టకు చేరుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో సిరీస్ మరింత రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో, మాంచెస్టర్లో జరగనున్న నాలుగో టెస్ట్కు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ కోకు స్లెడ్జింగ్ విషయంలో స్పష్టమైన హెచ్చరిక జారీ చేశాడు. “ఘర్షణ పూరితమైన” వాతావరణం నెలకొనే అవకాశం ఉందని స్టోక్స్ వ్యాఖ్యానించాడు.
లార్డ్స్ టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పలుమార్లు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, భారత్ ఇన్నింగ్స్ సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు, ముఖ్యంగా బెన్ డకెట్, భారత బ్యాట్స్మెన్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. శుభ్మన్ గిల్ బ్యాటింగ్కు వచ్చినప్పుడు, “600 పరుగులు చేశావు, ఈ సిరీస్కు చాలు” అంటూ బెన్ డకెట్ స్లెడ్జింగ్ చేశాడు. దీనికి గిల్ కూడా దీటుగా బదులిచ్చాడు. జక్ క్రాలీ టైమ్ వేస్ట్ చేస్తున్నాడంటూ గిల్ అసహనం వ్యక్తం చేయడం, ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్, బెన్ డకెట్కు ఘాటైన “సెండ్-ఆఫ్” ఇవ్వడం వంటివి చర్చనీయాంశంగా మారాయి.
ఈ నేపథ్యంలో, నాలుగో టెస్ట్కు ముందు బెన్ స్టోక్స్ మీడియాతో మాట్లాడుతూ, “మేం ఇతర చోట్లకు వెళ్ళినప్పుడు, కొన్ని జట్లు మా పట్ల మేం ఉన్నంత స్నేహపూర్వకంగా ఉండవు. మేం దానిని మార్చడానికి ప్రయత్నిస్తున్నామని నేను అనుకుంటున్నాను. 11 మంది ఆటగాళ్లను దగ్గరికి వచ్చి స్లెడ్జింగ్ చేయడానికి చూసినప్పుడు, మేం దానిని ఘర్షణ పూరితంగా మారుస్తామని వారికి తెలుసు” అని అన్నాడు. తన జట్టు స్లెడ్జింగ్కు సిద్ధంగా ఉందని, అవసరమైతే ఘాటుగా బదులిస్తామని స్టోక్స్ పరోక్షంగా హెచ్చరించాడు.
లార్డ్స్ టెస్టు తర్వాత శుభ్మన్ గిల్ స్లెడ్జింగ్ గురించి మాట్లాడుతూ, “ఇది మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. రెండు జట్లు గట్టిగా పోరాడుతున్నాయి, మ్యాచ్ గెలవడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. ఇలాంటి క్షణాలు సిరీస్ను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి” అని వ్యాఖ్యానించాడు. ఇది చూస్తుంటే, నాలుగో టెస్టులో స్లెడ్జింగ్ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. సిరీస్ను సమం చేయాలంటే టీమిండియా ఈ నాలుగో టెస్ట్లో తప్పక గెలవాలి. ఇప్పటికే మాంచెస్టర్లో భారీ వర్షం కురుస్తోంది. ఇది మ్యాచ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ వాతావరణ పరిస్థితులతో పాటు, ఇరు జట్ల మధ్య పెరిగిన స్లెడ్జింగ్ యుద్ధం కూడా మ్యాచ్కు మరింత ఉత్కంఠను జోడిస్తోంది.
నాల్గవ టెస్టులో బ్యాట్, బంతి పోరాటంతో పాటు, మాటల యుద్ధం కూడా అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఉత్కంఠభరిత సిరీస్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..