
IND vs AFG 3rd ODI : భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ ముగిసిన వెంటనే ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీకి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నుంచి గట్టి షాక్ తగిలింది. సిరీస్లోని చివరి వన్డే మ్యాచ్లో మైదానంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు గాను ఐసీసీ అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో పదే పదే హెచ్చరించినప్పటికీ వినకుండా ఒకే తప్పును పదే పదే చేయడంతో ఐసీసీ అధికారికంగా అతనిని మందలించింది.
చెన్నై వన్డేలో అసలేం జరిగిందంటే?
జూన్ 20న చెన్నై వేదికగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ మధ్యలో ఉన్న డేంజర్ జోన్పై పదే పదే పరుగెత్తాడు. బౌలర్లకు అనుకూలించేలా పిచ్ను ఉండాలన్న ఉద్దేశంతోనే అతను అలా చేస్తున్నట్లు అంపైర్లు గుర్తించారు. అంపైర్లు మొదట ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 31వ ఓవర్లో హష్మతుల్లాను గట్టిగా హెచ్చరించారు. అయినప్పటికీ బుద్ధి మార్చుకోని అతను, మళ్లీ 40వ ఓవర్లో అదే తప్పును పునరావృతం చేశాడు.
భారత్కు లభించిన 5 పెనాల్టీ పరుగులు
అంపైర్లు రెండుసార్లు హెచ్చరించినప్పటికీ ఆఫ్ఘన్ కెప్టెన్ పిచ్పై పరుగెత్తడం ఆపకపోవడంతో క్రికెట్ నిబంధనల ప్రకారం అంపైర్లు కఠిన నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలను అతిక్రమించినందుకు గాను ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు 5 పరుగుల భారీ పెనాల్టీ విధించారు. దీనివల్ల భారత జట్టుకు ఉచితంగా 5 పరుగులు లభించాయి. ఒక అంతర్జాతీయ మ్యాచ్లో కెప్టెన్ హోదాలో ఉండి ఇలాంటి బాధ్యతారహితమైన తప్పు చేయడంపై క్రికెట్ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
డిమెరిట్ పాయింట్ విధిస్తూ ఐసీసీ అధికారిక ప్రకటన
ఈ ఘటనపై ఐసీసీ మ్యాచ్ రెఫరీ నివేదిక ఆధారంగా హష్మతుల్లా షాహిదీని ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవెల్ 1 కింద దోషిగా తేల్చారు. ఐసీసీ రూల్స్ లోని ఆర్టికల్ 2.10.10 (పిచ్ను పాడు చేయడం లేదా నిబంధనలు ఉల్లంఘించడం)ను అతను బ్రేక్ చేసినట్లు స్పష్టం చేశారు. దీనితో పాటు అతని క్రమశిక్షణా రికార్డు ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్ను కూడా యాడ్ చేశారు. గత 24 నెలల కాలంలో హష్మతుల్లా ఇలాంటి తప్పు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఒకవేళ భవిష్యత్తులో మరిన్ని డిమెరిట్ పాయింట్లు వస్తే అతనిపై మ్యాచ్ల నిషేధం పడే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి